మేడారం వెళ్లి మొక్కులు చెల్లించలేని వారికి కార్గో పార్శల్‌ సర్వీసులు.. ఎప్పటినుంచంటే | Sakshi
Sakshi News home page

TSRTC Hyderabad: మేడారం వెళ్లి మొక్కులు చెల్లించలేని వారికి కార్గో పార్శల్‌ సర్వీసులు.. ఎప్పటినుంచంటే

Published Mon, Feb 7 2022 7:13 PM

TSRTC Cargo Parcel Facility For Bangaram To Medaram Jatara - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదు.. కోరుకుంటే మొక్కు బంగారాన్ని మేడారం చేర్చి అమ్మ వారికి సమర్పించనుంది. మేడారంలో సమక్క-సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు సమర్పించాలనుకునే వారికి టీఎస్‌ఆర్టీసీ శుభవార్తనందించింది. మేడారం వెళ్లి మొక్కు చెల్లించలేని వారికి ఆర్టీసీ కార్గో ద్వారా పార్శల్‌ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. దేవాదాయ శాఖ సహకారంతో టీఎస్‌ఆర్టీసీ ఈ కార్యక్రమానికి నాంది పలికింది. మేడారం జాతర సందర్భంగా ‘బంగారం పంపించడం మీ వంతు. అమ్మ వారికి సమర్పించడం మా తంతు" అనే నినాదంతో ఆర్టీసీ ఈ సేవల్ని ప్రారంభిస్తోంది. 

భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా సమక్క-సారలమ్మ అమ్మవార్లకు సమర్పించనున్నారు. అంతేగాక అమ్మ వారికి భక్తులు బంగారాన్ని సమర్పించిన తరువాత ప్రసాదాన్ని కూడా తిరిగి అందించనున్నారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని బస్ స్టేషన్ల నుంచి ఈ సేవల్ని భక్తులు వినియోగించుకునే విధంగా తగిన కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. 

5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను పంపించుకోవచ్చని, దేవాదాయ శాఖ సహకారంతో అమ్మ వారికి సమర్పించడంతో పాటు మళ్లీ సంబంధిత భక్తులకు 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మ వారి పసుపు కుంకుమ, అమ్మ వారి ఫోటోకూడా అందజేయడం జరుగుతుందన్నారు. ఇందుకు 200 కిలోమీటర్ల (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సేవలు ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఫోన్ ద్వారా సమాచారం అందిన తరువాత బంగారాన్ని బుక్ చేసిన చోటే ప్రసాదాన్ని తిరిగి పొందవచ్చన్నారు.

Advertisement
Advertisement