‘వైల్డ్‌ లైఫ్‌ టూరిజం’కి న్యూ లుక్‌! | Sakshi
Sakshi News home page

‘వైల్డ్‌ లైఫ్‌ టూరిజం’కి న్యూ లుక్‌!

Published Mon, Oct 17 2022 1:25 AM

Wild Life Tourism Being Prepared In Telangana With Thrill Of Wild Life - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొంగొత్త హంగులతో ‘వైల్డ్‌ లైఫ్‌ టూరిజం’సిద్ధమవుతోంది. తెలంగాణలో పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో వచ్చేనెల రెండోవారంలో మొదలు కానుంది. ఏటీఆర్‌లోని ఫరాహాబాద్‌లో టైగర్‌ సఫారీని ఏడాదికొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ‘వైల్డ్‌లైఫ్‌ టూరిజం ప్యాకేజీ టూర్‌’లను అందుబాటులోకి తెచ్చి గతేడాది నవంబర్‌ 14న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

ఈ ప్యాకేజీ టూర్‌లను అటవీశాఖ రూపొందించిన ఓ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకునే వీలుకల్పించారు. గతేడాది ప్రారంభించిన ఈ టైగర్‌ సఫారీని ఈసారి మరిన్ని సౌకర్యాలతో మరింత ఆహ్లాదాన్ని పంచేలా జంతుప్రేమికులను అలరించేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది. 

రాత్రి అడవిలో ప్రకృతి ఒడిలో సేదతీరేలా...: టైగర్‌ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్‌ స్టడీటూర్, ఆదివాసీలను కలు సుకుని వారి జీవనశైలిని తెలుసుకోవడం వంటి వాటితో పాటు మరిన్ని అదనపు ఆకర్షణలను జతచేస్తున్నారు. దా దాపు 24 గంటల పాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదతీ రేలా దీనిని రూపొందించారు. ఇందులో భాగంగా రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టిఇళ్లలో బసతో కొత్త అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తారు.

మధ్యాహ్నం నుంచి ప్రారంభమ య్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరి రక్షణ, పచ్చదనం కాపాడేందు కు అటవీశాఖ నిర్వహిస్తు న్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్‌ సెంటర్‌ను, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్‌లను చూపిస్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. సాయంత్రానికి క్యాంప్‌కు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు పొద్దునే సందర్శకులను టైగర్‌ సఫారీకి తీసుకెళ్లడంతో టూర్‌ ముగుస్తుంది. ఈ టూర్‌లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్‌గైడ్‌లుగా వ్యవహరించనున్నారు. 

ఈసారి అంతా కొత్త కొత్తగా..
గత ఏడాదితో పోల్చితే కొత్త కాటేజీలు సిద్ధం చేయడంతో పాటు, టైగర్‌ సఫారీకి అనువైన 8 కొత్త వాహనాలను కొంటున్నాం. అట వీ, జంతుప్రేమికులకు ఆహ్లాదం పంచడంతోపాటు, ఇక్కడ గడిపే సమయం మధురానుభూతులను నింపేందుకు దోహ దపడే చర్యలు చేపడుతున్నాం. నూతనంగా అందుబాటులోకి తెస్తున్న కాటేజీలతో పాటు మట్టి ఇళ్లు, ఒక ట్రీ హౌస్, ఎయిరోకాన్‌ హౌస్‌ కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం.

గతేడాది టైగర్‌ సఫారీని మొదలుపెట్టినపుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయి. ఈ ఏడాది సఫారీ ఏరియాలో కాకుండా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో తరచుగా పులులు తారసపడుతుండటాన్ని బట్టి సంఖ్య పెరిగినట్టుగా అంచనా వేస్తున్నాం. చెంచుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పుట్టగొడుగులు, తేనేటీగల పెంపకంలో శిక్షణనిస్తున్నాం.     
– ఐఎఫ్‌ఎస్‌ అధికారి రోహిత్‌ గొప్పిడి, అమ్రాబాద్‌ డీఎఫ్‌ఓ 

Advertisement
Advertisement