పటాన్‌చెరు: భార్యాభర్తల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన వదినపై.. | Sakshi
Sakshi News home page

పటాన్‌చెరు: భార్యాభర్తల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన వదినపై..

Published Sun, Dec 25 2022 8:24 AM

woman died in between wife and husband clash at Patancheruvu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భార్యాభర్తల మధ్య వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బొల్లారం సీఐ సురేందర్‌ రెడ్డి, అమీన్‌పూర్‌ ఎస్‌ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడురు మండలం జయ్యారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ బతుకుదెరువు కోసం వచ్చి బాల్‌నగర్‌ చింతల్‌లో ఉంటున్నారు.

కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శ్రీనివాస్‌ అతడి భార్య సునీత కొన్ని రోజులుగా గొడవపడుతున్నారు. సునీత అమీన్‌పూర్‌ శ్రీవాణి నగర్‌లో ఉంటున్న తన అక్క సుజాత(46) వద్దకు నెల క్రితం వచ్చింది. అక్కడే ఉంటూ బాచుపల్లి సమీపంలోని అరవిందో పరిశ్రమలో కూలి పనిచేస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటలకు సునీత డ్యూటీకి వెళ్లింది. వెనుక అక్క సుజాత, ఆమె కుమారుడు సాయికిరణ్‌ బైక్‌పై వచ్చారు.

పరిశ్రమ సమీపంలో సునీత ఆమె భర్త శ్రీనివాస్‌ గొడవపడుతున్నారు. వారిని ఆపే ప్రయతనం చేసేందుకు వెళ్లిన సుజాత, సాయికిరణ్‌తో పాటు సునీతపై శ్రీనివాస్‌ కత్తితో దాడి చేశాడు. దాడిలో సుజాత అక్కడికక్కడే మృతిచెందగా, సునీత, సాయికిరణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే  స్థానిక మమత ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పటాన్‌చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని  వివరాలు తెలుసుకున్నారు. 
చదవండి: (భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా..)

Advertisement
Advertisement