Sakshi News home page

ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నరోత్తమ్‌ నియామకం

Published Fri, Sep 8 2023 8:28 PM

Yerpula Narotham Appointed As Telangana SC Corporation Chairman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా  జహీరాబాద్‌కు చెందిన ఏర్పుల నరోత్తమ్‌ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ ఉత్వర్వులను  ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్‌కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.

న‌రోత్త‌మ్ రాజ‌కీయ ప్ర‌స్థాన‌మిదీ..
ఏర్పుల న‌రోత్త‌మ్ జహీరాబాద్‌లోని పస్తాపూర్‌లో 1965, ఏప్రిల్ 19వ తేదీన చంద్ర‌మ్మ‌, న‌ర్స‌య్య దంప‌తుల‌కు మూడో సంతానంగా జ‌న్మించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 1987 సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నీటి పారుద‌ల శాఖ‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేశారు.  శ్రీశైలం ప్రాజెక్టు కాలువ‌ల డిజైన్ల‌లో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషించారు. అనంతరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప్ర‌మోషన్ పొందారు. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇంచార్జిగా వ్య‌వ‌హ‌రించారు. వికారాబాద్‌లో మైన‌ర్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఇంచార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్ర‌జా సేవ చేయాల‌నే ఉద్దేశంతో 2008లో త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల బాట ప‌ట్టారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున జ‌హీరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. మార్జిన‌ల్ ఓట్ల‌తో న‌రోత్త‌మ్ ఓట‌మి చ‌విచూశారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023, జులై 6వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏర్పుల న‌రోత్త‌మ్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement