ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే.. | Sakshi
Sakshi News home page

ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే..

Published Sun, Apr 16 2023 1:10 PM

Young Man Died In Warangal - Sakshi

వరంగల్: ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే.. ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయావా.. అంటూ చరణ్‌ భార్య ఉమ రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. పెళ్లి 5 నెలలు కాక ముందే భర్త మృతి చెందడంతో ఆ యువతి గుండెలవిసేలా విలపించింది. బంధువు అంత్యక్రియలకు వచ్చిన యువకుడు ఎస్సారెస్పీ కాలువలో పడి శుక్రవారం గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన ఆ యువకుడు శనివారం శవమై తేలాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి స్వస్థలం కాగా ప్రస్తుతం హన్మకొండలో నివాసం ఉంటున్నారు.

గుగులోత్‌ రాములు–కళమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దవాడు గుగులోత్‌ చరణ్‌ (29) ఐదు నెలల క్రితమే పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లె ఎల్లమ్మగడ్డకు చెందిన ఉమతో వివాహమైంది.  సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దవంగర మండలంలోని గంట్లకుంట శివారు అమర్‌సింగ్‌ తండాలో తమ బంధువు జాటోతు అమర్‌సింగ్‌ మృతి చెందాడు. శుక్రవారం తన తల్లిదండ్రులతో కలిసి అంత్యక్రియలకు వచ్చాడు. అనంతరం కాలకృత్యాలు తీసుకునేందుకు పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాలువలోకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు.

గమనించిన స్థానికులు అతన్ని రక్షించేందుకు తాడు సహాయంతో ప్రయత్నించినా ఈత రాకపోవడంతో నీటిప్రవాహం ఎక్కువగా ఉండడంతో చరణ్‌ గల్లంతయ్యాడు. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడికి తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై రాజు తెలిపారు.

Advertisement
Advertisement