● ఘనంగా ప్రారంభమైన జేఎన్టీయూ అంతర్ కళాశాలల గేమ్స్మీట్
గూడూరురూరల్: క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చిని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ పీవీ.కృష్ణయ్య తెలిపారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జేఎన్టీయూ అనంతపూర్ 11వ అంతర్ కళాశాలల గేమ్స్ మీట్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జేఎన్టీయూ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరి బీ.జోజిరెడ్డి ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి జాతీయ జెండా, యూనివర్సిటీ జెండాలను ఎగురవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ గేమ్స్ మీట్లో జేఎన్టీయూ పరిధిలోని 6 జిల్లాల నుంచి 48 కళాశాలలకు చెందిన సుమారు 1,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి పీవీ.కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న మానసిక ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందాలంటే క్రీడా కార్యక్రమాలను ఆయా కళాశాలలు తప్పని సరిగా ప్రోత్సహించాలన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్లు, సెల్ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నందువల్ల శారీరక శ్రమ ఉండడం లేదన్నారు. విద్యార్థిని, విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఏకాగ్రత పెంపొందించుకోవచ్చని చెప్పారు. జేఎన్టీయూ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరి బీ.జోజిరెడ్డి మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎ.మోహన్, ప్రిన్సిపల్ ధనుంజయ, వేణుమాధవ్, ఏ.ఓ రామయ్య, నాగేశ్వరరావు, పీడీ రవిచంద్ర పాల్గొన్నారు.