తిరుపతి కల్చరల్ : విద్యలోనే ఉన్నత సమాజ నిర్మాణం సాధ్యమని కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతిలోని గిరిజన భవన్లో శంకర్ శాలినీ ఫౌండేషన్, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులతోపాటు జానపద కళల సంస్కృతి, సాంప్రదాయాల ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యతోనే మనిషికి విలువ, గౌరవం లభిస్తుందని చెప్పారు. బీఆర్ అంబేడ్కర్ విద్యాజ్ఞానంతోనే రాజ్యాంగ రచన చేయగలిగారని వెల్లడించారు. సమసమాజ స్థాపనకు మన మూలాలను కాపాడుకుంటూ, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలు అందించాలని సూచించారు. ప్రభుత్వం సైతం విద్యారంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. విప్లవాత్మకమైన పథకాలతో విద్యావ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుతోందన్నారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ 2015లో శంకర్ శాలిని ఫౌండేషన్ స్థాపించి గిరిజనులకు విద్య, నాగరికత, జీవనశైలిలో మార్పులకు శ్రమిస్తున్నామని తెలిపారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. అనంతరం ప్రదర్శించిన జానపద సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్టీ సంక్షేమ, సాధికార అధికారి చెన్నయ్య, బీసీ సంక్షేమ, సాధికారత అధికారి భాస్కర్రెడ్డి, జిల్లా సమాచార శాఖ అధికారి బాలకొండయ్య, ఎస్వీయూ బోర్డు సభ్యుడు మల్లారపు మధు, నేతలు నాగరాజు, సోమశేఖర్ ఆచారి పాల్గొన్నారు.