సూళ్లూరుపేట: సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను గురువారం తిరుపతి జేసీ కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. సూళ్లూరుపేట, తడ మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. సీఎం హెలీప్యాడ్, బహిరంగ సభ నిర్వహించేందుకు మరికొన్ని స్థలాలను పరిశీలించారు. తడ మండలం మాంబట్టులోని అపాచీ ఫుట్వేర్ కంపెనీలో హెలీప్యాడ్, సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని తారకేశ్వరా టెక్స్టైల్స్ కంపెనీ ఆవరణలో హెలీప్యాడ్ను పరిశీలించారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, చెంగాళమ్మ ఆలయ సమీపంలోని సుమారు 15 ఎకరాల మైదానాలను పరిశీలించారు. సూళ్లూరుపేట పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ సమీపంలో ఎప్పుడో బ్రిటీష్ కాలంలో నిర్మించి శిథిలావస్థకు చేరడంతో నూతనంగా రూ. 35 కోట్లతో నాలుగులేన్ల వంతెనను నిర్మించనున్నారు. ఈ పనులకు భూమిపూజ చేసేందుకు ముఖ్యమంత్రి జగనన్న విచ్చేయనున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజాసంకల్పయాత్రలో చెన్నమనాయుడుపేట వద్ద జరిగిన మత్స్యకారుల సదస్సులో జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సముద్ర ముఖద్వారాల పూడిక తీత కార్యక్రమానికి సుమారు రూ.248 కోట్లు మంజూరు చేసిన విష యం తెలిసిందే. ఈ పనులను ప్రారంభించేందుకు ముందుగా ముఖ్యమంత్రి జగనన్న చేతులు మీదు గాభూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహంచనున్నారు.
అందరూ సమష్టిగా పనిచేయాలి
ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూళ్లూరుపేట పర్యటనకు విచ్చేయనున్నారని, అధికారయంత్రాంగమంతా సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆయన సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష స్థాయి సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేట ఆర్డీవో ఆర్ చంద్రముని, తహసీల్దార్ కన్నంబాక రవికుమార్, ఇన్చార్జి ఎంపీడీఓ మురళీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జెట్టి వేణుయాదవ్ పాల్గొన్నారు.
● ఏర్పాట్లను పరిశీలించిన జేసీ