నిరుపేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోంది. దీనిపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ముక్కంటి ఆలయ
ఈఓగా రామారావు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ నూతన ఈఓగా కేఎస్ రామారావు నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కుటుంబసభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. గతంలో ఆయన శ్రీకాళహస్తి ఆర్డీఓగా విధులు నిర్వర్తించారు.అనంతరం విజయవాడ కనకదుర్గ ఆలయానికి ఈఓగా బదిలీపై వెళ్లారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓగా బాధ్యతలు చేపట్టారు. రామారావు మాట్లాడుతూ ముక్కంటి ఆలయంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతమన్నారు. పాలకమండలి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆలయాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
చైల్డ్ ప్రొటెక్షన్లో
ఉద్యోగాలకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : మిషన్ వాత్సల్య స్కీమ్లో భాగంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఉద్యోగాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వెంకటరమణారెడ్డి కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్)–1, ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్–1, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్–1, సోషల్ వర్కర్ –1, అకౌంటెంట్ –1, డేటా అనలిస్ట్ –1, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్–1, అవుట్ రీచ్ వర్కర్–2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు డిసెంబర్ 4వ తేదీలోపు జిల్లా మహిళా శిశు అభివృద్ధి, సాధికారత అధికారి బి– బ్లాక్, కలెక్టరేట్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఇతర వివరాల కోసం tirupathi.ap.gov.in వెబ్సైట్ సందర్శించాలని తెలిపారు.