తిరుపతి రూరల్ : తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు వాసులను వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పెనుగాలులు వీచే ప్రమాదమున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాత భవనాల్లో నివసించేవారిని వెంటనే పునరావాసకేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా 4, 5 తేదీలలో పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి మండల కేంద్రంలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి, ఆపదలో ఉన్నవారిని సకాలంలో ఆదుకోవాలని స్పష్టం చేశారు.
పకడ్బందీగా ‘పునరావాసం’
శ్రీకాళహస్తి: తుపాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరికై నా సమస్య వస్తే వెంటనే కంట్రోల్రూమ్కు ఫోన్ చేయాలని సూచించారు. వలంటీర్ ద్వారా కమిషనర్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు. అధికారులు సకాలంలో ప్రజలకు సహాయక చర్యలు అందించాలని స్పష్టం చేశారు. సమస్యలపై 0877–2236007, 9347755466 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
నేటి ‘స్పందన’ రద్దు
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని తుపాను కారణంగా రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుసున్న నేపథ్యంలో అర్జీదారులు ఇబ్బంది పడే అవకాశముందని స్పందన రద్దు చేసినట్లు వెల్లడించారు.
శాస్త్రోక్తంగా బాలాలయ ఉత్సవం
నాగలాపురం : శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామి ఆలయ జీర్ణోద్ధర్ణలో భాగంగా బాలాలయ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఆదివారం రెండో రోజు శాస్త్రోక్తంగా హోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ దేవేంద్రబాబు, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, షరాబు ఉదయకుమార్, జూనియర్ అధికారి జానకిరామ్ పాల్గొన్నారు.