తాండూరు రూరల్: ప్రభుత్వ కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. తాండూరు మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఆఫీసు ఆవరణ చెత్తాచెదారంతో ఉండటాన్ని గమనించారు. తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, ఎంపీడీఓ సుదర్శన్రెడ్డిపై అసహనం వ్యక్తంచేశారు. పదిహేను రోజుల తర్వాత తాను మళ్లీ వస్తానని, అప్పటిలోపు వాతావరణం పూర్తిగా మారాలని తెలిపారు. కోకట్ పరిధిలోని మనోహర టౌన్షిప్లోని రాజీవ్ స్వగృహలో 14 ఓపెన్ ప్లాట్లు, 54 వివిధ దశల్లో ఉన్న గృహాలకు నిర్వహించే.. వేలం పాటలో పాల్గొని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ప్లాట్ల ధర గజం రూ.10 వేలు ఎక్కువ అవుతోందని రూ.5 వేలుగా నిర్ణయిస్తే కొనుగోలుదారులు ముందుకు వస్తారని కలెక్టర్కు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన ఈనెల 10న మరోసారి సమావేశం ఏర్పాటు చేసి 17న వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు.
కొందరి కారణంగా చెడ్డ పేరు
కొంతమంది అధికారులు, ఉద్యోగుల కారణంగా ధరణి పోర్టల్కు చెడ్డపేరు వస్తోందని కలెక్టర్ అన్నారు. వెబ్సైట్ నిర్వహణపై అవగాహన లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధరణి హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. ధరణి ద్వారా రైతుల సమస్యలను 99శాతం పరిష్కరించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ అశోక్కుమార్, డీఎస్పీ శేఖర్గౌడ్ పాల్గొన్నారు.
విధుల్లో నిమగ్నం
కలెక్టర్ వస్తున్నారని తెలియడంతో ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ఎక్కడికక్కడే విధుల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్ ఏ క్షణం ఎక్కడకు వస్తారోనని తెలియక హడలిపోయారు. గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కొత్త కలెక్టర్ రాకతో ఉద్యోగులు, అధికారులు బాధ్యతగా పనిచేస్తున్నారని ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
అవ్వా.. పెడ్తరా బువ్వ?
తాండూరు మండలం నారాయణపూర్కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తన వారసులకు భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది. ఆమెను పలకరించిన కలెక్టర్.. శ్రీఅవ్వా నీ పేరు మీద ఉన్న భూమిని నీ వారసులకు చేయిస్తున్నావా..? భూమి రాసిస్తే నీకు బువ్వ పెడ్తారా..? అని అడగటంతో.. నమ్మకం ఉండటంతోనే తన మనవళ్ల పేరున చేయిస్తున్నానని వృద్ధురాలు చెప్పింది.
ఆవరణలు పార్కులను తలపించాలి
అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
తాండూరులో ధరణి హెల్ప్ డెస్క్ ప్రారంభం