తాండూరు: తాండూరు అసెంబ్లీ స్థానంపై హస్తం పార్టీలో సస్పెన్స్ వీడటంలేదు. నిన్నమొన్నటి వరకు ఈ స్థానం కోసం డజను మంది నేతలు పోటీపడిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం మాత్రం మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్)కి టికెట్ కేటాయించేందుకు మొగ్గు చూపింది. అభ్యర్థుల జాబితాలో కేఎల్ఆర్ పేరు మాత్రమే స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. అయితే చివరి నిమిషంలో ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ ఒత్తిడితో ధారూరు మండలానికి చెందిన రఘువీరారెడ్డి పేరు జాబితాలో చేరింది. దీనికితోడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ముఖ్య నేతలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు.. వారు కూడా తాండూరు టికెట్ కోసం పైరవీలు చేస్తుండటంతో టికెట్ పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది.
రెండు వర్గాలుగా నేతలు..!
నిన్నమొన్నటి వరకు అసెంబ్లీ స్థానం బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలకే దక్కుతుందని అంతా భావించారు. అయితే ప్రత్యర్థిని ఓడించాలంటే వా రు ఏ సామజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తా రో అదే సామాజిక వర్గానికి చెందిన నేతనే తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఏఐసీసీ సభ్యులు రమేష్ మహరాజ్ రేసులో నుంచి తప్పుకున్నారు. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలకు చీలిపో యిందని నేతల మధ్య టాక్ నడుస్తోంది. దీనికి బ లం చేకూరుస్తూ.. తాండూరు టికెట్ను మాజీ ఎ మ్మెల్యే కేఎల్ఆర్కు ఇవ్వాలని భట్టి వర్గం పట్టుబడుతుండగా.. చివరి నిమిషంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తన అనుచరుడైన ధారూరు మండలానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి పేరు ను జాబితాలో చేర్చారని సమాచారం. ఇటీవల తాండూరు కు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భర్త డాక్టర్ సంపత్కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు కూడా తమకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్..
ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఢిల్లీ నేతల వద్దకు వెళ్లింది. దీంతో రేసులో ఉన్న నేతలు ఢిల్లీకి మకాం మార్చారు. తాండూరు స్థానం ఆశిస్తున్న కేఎల్ఆర్తో పాటు రఘువీరారెడ్డి తమ అనుకూల వర్గంతో కలిసి ఇప్పటికే హస్తినలో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. తాండూరు సీటు విషయంలో రేవంత్రెడ్డి వర్గం పైచేయి సాధిస్తుందా.. లేక భట్టి విక్రమార్క వర్గం పైచేయి సాధిస్తుందా అనేది పార్టీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
హస్తినకు చేరిన తాండూరు టికెట్ పంచాయితీ
కేఎల్ఆర్కు మద్దతు తెలిపిన మెజార్టీ నేతలు
రేవంత్ సూచనతో తెరపైకి రఘువీరారెడ్డి పేరు
టికెట్ కేటాయింపుపై కొనసాగుతున్న ఉత్కంఠ