అనంతగిరి: గిరిజనుల సమస్యలు పరిష్కరించే పార్టీలకే మద్దతు ఉంటుందని అఖిల భారత గిరిజన సమాఖ్య (ఏఐటీఎఫ్ )రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్ నాయక్, ప్రధాన కార్యదర్శులు సు రేష్ నాయక్తెలిపారు. ఈ మేరకు మంగళవారం సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. గిరిజనులు, బంజారాలను రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నాయని, మేనిఫెస్టోలలో గిరిజనుల గురించి లేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని గిరిజన, బంజారాల కోసం ఏ పార్టీ ఆలోచన చేయలేక పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
అక్రమంగా కలపతరలిస్తున్న లారీ స్వాధీనం
దోమ: అక్రమంగా కలప తరలిస్తున్న ఓ లారీని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. దోమ మండల పరిధిలోని పాలేపల్లిలో కొందరు వ్యాపారులు రైతుల పొలాల్లోని చెట్లను నరికేసి లారీలో లోడ్ చేస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు కలప రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలను అడిగారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో లారీని స్టేషన్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, లారీని ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
వాహనం ఢీకొని మున్సిపల్ కార్మికురాలు మృతి
షాద్నగర్రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మున్సిపల్ కార్మికురాలు మృతి చెందిన సంఘటన మంగళవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన పెద్దలావణ్య(40) కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగంలో కార్మికురాలిగా పని చేస్తుంది. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం లావణ్యను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలోగుర్తుతెలియని వ్యక్తి మృతి
మొయినాబాద్: వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ సమీపంలోని రాధాస్వామి సత్సంగ్ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రహరారి వెంట మంగళవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి(45)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.