ఇబ్రహీంపట్నం: పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మంగళవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. నియోజకవర్గంలో 1214 మంది ఓటర్లు పోలీస్ శాఖల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నా రు. ఎన్నికల సంఘం వారికి మంగళ, బుధవారా ల్లో పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇబ్రహీంపట్నంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో వారు ఓటేశారు. మొదటి రోజు 364 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి తెలిపారు. బుధవారం ఓటేసేందుకు అవకావం ఉందన్నారు.
ఓటర్లకు ప్రలోభాలు
ఫెసిలిటేషన్ సెంటర్ సమీపంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని ఆయా పార్టీ శ్రేణులు ఓటర్లను ప్రక్కకు తీసుకెళ్లి తమ అభ్యర్థులకు ఓటు వేయాలని డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ రోజు పార్టీ శ్రేణుల ప్రచారం మాదిరిగానే మంగళవారం ఫెసిలిటేషన్ సెంటర్ పరిసరాల్లో కనిపించడం గమనార్హం.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగం
చేవెళ్ల: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభించిన ఈ పోలింగ్లో 261 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. పోలీసులకు సంబంధించి 971 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటుహక్కు కలిగి ఉండగా అందులో 261 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. హోం ఓటింగ్లో భాగంగా సీనియర్ సిటిజన్లు 177 మంది ఉండగా 160 మంది ఓటు వేశారని తెలిపారు. దివ్యాంగులకు సంబంధించి 54 మంది ఓటర్లు ఉండగా 49 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు. పోస్టల్ ఓటింగ్ ఉపయోగించుకునే పోలీసు ఉద్యోగులకు బుధవారం కూడా అవకాశం ఉంటుందని చెప్పారు.
1214 మందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ
కార్యాలయంలో పోలింగ్ కేంద్రం
మొదటి రోజు ఓటుహక్కు
వినియోగించుకున్న
364 మంది ఉద్యోగులు
వారు ఇంటి వద్ద వేశారు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన హోం ఓటింగ్లో సోమ, మంగళవారాల్లో 45 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులు, 40శాతంకు పైగా వైకల్యం ఉన్న దివ్యాంగుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా హోం ఓటింగ్ విధానం తీసుకువచ్చారు. నియోజకవర్గంలో 52 మందిని అర్హులుగా గుర్తించగా... మూడు బృందాలు హోం ఓటింగ్ను నిర్వహించాయి. ఇందులో 45 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా అరుగురు అందుబాటులోకి లేరని, మరొకరు చనిపోయినట్లు అనంతరెడ్డి తెలిపారు. ఓటు వేయని వారికి మరో అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.