తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మంజూరు చేయించానని చెబుతున్న పనుల వివరాలు కేవలం కాగితాలపైనే ఉన్నాయని ఖజానాలో మాత్రం నిధులు శూన్యమని పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ విమర్శించారు. గురువారం కాంగ్రెస్ పట్టణ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను ప్రస్తుత ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారంటూ రోహిత్రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్రెడ్డి, పార్టీ కార్యకర్తలను, నాయకులను మోసం చేసి స్వలాభం కోసమే పార్టీ మారారన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని.. ఎస్డీఎఫ్ పనులను చేపట్టేందుకు వచ్చే కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని చెప్పిన మనసున్న వ్యక్తి మనోహర్రెడ్డి అన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక హెచ్చరికలు చేస్తే ఎవరూ భయపడరని సమాధానం ఇచ్చారు. టికెట్టు ఖరారైన 35 రోజుల్లోనే తాండూరు ప్రజల మనసు గెలిచి ఎమ్మెల్యేగా మనోహర్రెడ్డి గెలిచిన విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హ బీబ్ లాల, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శో భారాణి, మండల అధ్యక్షుడు నాగప్ప, గోపాల్, నర్సిరెడ్డి, మాధవి, సర్దార్ ఖాన్ తదితరులు ఉన్నారు.