● ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,ఏపీసీఎంఎఫ్సీ చైర్మన్ జాన్ వెస్లీ ● దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీర్మానంపై హర్షం ● సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
సాక్షి, విశాఖపట్నం: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అద్దేపల్లి రవిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి సంబరాలు నిర్వహించారు. అనంతరం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని శాసనసభలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపే నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. అన్ని ఉపకులాలు కలిపి దళిత క్రైస్తవులు 40 లక్షల మంది వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారన్నారు. వారందరికీ మేలు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామన్నారు.
ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి మాట్లాడుతూ ఒక్క రోజులో 18 జీవోలు ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందని నాగిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో యాత కార్పొరేషన్ చైర్పర్సన్ పిల్లి సుజాత, ముఖ్యనాయకులు జి.రవిరెడ్డి, మన్యాల శ్రీనివాసరావు, ఎం.సునీల్ కుమార్, రాజ్కుమార్, రోజా రాణి, మద్దాల ఛాయాదేవి, విజయ్, దాస్ మోహన్, కండిపల్లి శ్రీధర్, జగ్గుపల్లి అప్పలరాజు, జార్జ్ నాని తదితరులు పాల్గొన్నారు.
ఏపీ టీచర్స్ యూనియన్ హర్షం
విశాఖ విద్య: దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలని అసెంబ్లీలో చేసిన తీర్మానం హర్షణీయమని ఏపీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వై. దేముడు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. సామాజిక న్యాయంకు ప్రాధాన్యత ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. బోయ, వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల వెనుకబడిన ఆయా వర్గాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఏపీ టీచర్స్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.