ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సోషల్ ఎక్స్క్లూజివ్, ఇంక్లూజివ్ పాలసీ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో 87 శాతం మంది వృద్ధులు ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పింఛన్ తమకు ఉపయుక్తంగా నిలుస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేంద్రం నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రచురించిన పరిశోధన పత్రాలతో కూడిన ప్రత్యేక సంచికను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. దేశంలో వృద్ధులు గౌరవ ప్రదంగా జీవనం సాగిస్తున్నారా?, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, తదితర అంశాలు వారికి చేరువవుతున్నాయా? అనే అంశాలను భాగం చేస్తూ రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వచ్చిన 23 పరిశోధన పత్రాల సంకలనంగా శ్రీఎల్డర్లీ పర్సన్స్ ఇన్ ఇండియా–సోషల్ ఎక్స్క్లూజివ్ అండ్ వెల్ఫేర్శ్రీపుస్తకాన్ని తీర్చిదిద్దారు. అలాగే సెంటర్ ఆధ్వర్యంలో విశాఖలోని వివిధ మురికివాడల్లో ప్రత్యేకంగా ‘ఓల్డేజ్ పెన్షన్ అండ్ సోషల్ ఇంక్లూజివ్ ఆఫ్ ది ఎల్డర్లీ–ఏ స్టడీ ఆఫ్ ది స్లమ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ’అంశంపై అధ్యయనం చేశారు. ఇందులో 87 శాతం మంది వృద్ధులు ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పింఛన్ తమకు ఉపయుక్తంగా నిలుస్తోందని, సామాజికంగా తమకు గుర్తింపు లభిస్తోందని అభిప్రాయపడ్డారు. 83.5 శాతం మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పెన్షన్ పెంపు తమకు ఎంతో భరోసాన్నిస్తోందని వెల్లడించారు. సర్వే నివేదికను వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్రం సంచాలకుడు డాక్టర్ పి.సుబ్బారావు, విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు, కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.