రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్పర్సన్ పిల్లా సుజాత
కొమ్మాది: రాష్ట్రంలోని నగరాల కులస్తులను బీసీ–‘డి’లో చేర్చడం హర్షణీయమని రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్పర్సన్ పిల్లా సుజాత అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల కులస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఎండాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్రలోని నగరాలను బీసీలుగా చేస్తే.. ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 26 జిల్లాల్లోని నగరాలను బీసీ–డీలో చేరుస్తూ జీవో విడుదల చేశారన్నారు. తమ ప్రాణమున్నంత వరకూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చేసుకుంటేనే రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు బలహీన వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు. కోలా గురువులు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఏకై క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ కార్యాలయ ఇన్చార్జి రవిరెడ్డి, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్లు కోరికాన మోహన్ రావు, వాండ్రాసి శ్యామల, గుజ్జారి లలిత, నాగోతి పార్వతి, బాయన మీనా, పార్టీ నాయుకులు పెండ్ర అప్పన్న పాల్గొన్నారు.
సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం
కళింగ వైశ్య, కళింగ కోమటి సామాజిక వర్గాలను బీసీ–డీగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు వర్తింపజేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఎండాడలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సకలాభక్తుల ప్రసాదరావు, పొట్నూరు మాధవీ మధుసూదనరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కళింగ వైశ్య, కళింగ కోమటి సామాజికవర్గీయులు సీఎం జగన్కు రుణపడి ఉంటారన్నారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షుడు పెంటా చంద్రభూషణరావు, కంచరపాలెం సంఘం అధ్యక్షుడు విశ్వేశ్వరరావు, నారాయణగుప్త తదితరులు పాల్గొన్నారు.