భూసార పరీక్షలకు సన్నద్ధం
గురువారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2024●ఆకివీడు: దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, మద్దతు ధర లభించడంతో రైతులు ఖరీఫ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఖరీఫ్, రబీ సాగు దిగుబడులు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇదే ఉత్సాహంతో వచ్చే ఖరీఫ్ సాగుకు జిల్లాలో రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2.11 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచారు. ఈ నెలాఖరు నాటికి రబీ మాసూళ్లు పూర్తి కానున్నాయి. ఇప్పటికే జిల్లాలో మాసూళ్లు పూర్తయిన ప్రాంతాల్లో రైతులు పచ్చిరొట్ట సాగు చేపట్టారు. దీని ద్వారా భూసారం పెరిగే అవకాశం ఉంది.
భూసార పరీక్ష.. పంటకు రక్ష
భూసార పరీక్షలతో అధిక దిగుబడులు సాధించేలా యంత్రాంగం దృష్టి పెట్టింది. జిల్లాలో 5 వేల మట్టి నమూనాలు సేకరించి వాటిని పరీక్షించే దిశలో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించే సర్వే నంబర్లను గుర్తించారు. నెలాఖరులోపు శాంపిల్స్ సేకరించి, పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. జూన్ రెండో వారం నాటికి భూసార పరీక్షా ఫలితాల్ని ఆయా రైతులకు తెలియజేస్తారు. భూమిలో చౌడు, ఆమల గుణాల స్థాయిని నిర్ధారించి, సంబంధిత భూముల్లో సాగు చేయబోయే పంటలకు ఏఏ ఎరువులను వినియోగించాలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు తెలియజేస్తారు. తద్వారా భూసారాన్ని పెంచి, పంటలకు మంచి పోషకాల్ని అందజేసేందుకు కృషి చేస్తారు. మట్టి పరీక్షలతోనే పంటలకు సరైన బలాన్ని అందించి, అధిక దిగుబడుల దిశగా సాగును తీసుకువెళుతున్నారు.
చౌడు, ఉప్పునీటిని తట్టుకునే సాగు
పశ్చిమ డెల్టాలో రొయ్యల సాగుకు ఉపయోగించే ఉప్పునీరు (సెలనిటీ) శాతం అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూసారం క్షీణిస్తుంది. ఉప్పుటేరు, ఇతర ప్రాంతాల్లో చౌడు భూములు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చౌడును, సెలినిటీని తట్టుకుని సాగు చేసుకునేలా వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి. మచిలీపట్టణం వరి పరిశోధనా కేంద్రానికి చెందిన ఎంసీఎం 100 వంగడం చౌడు, సెలినిటీని తట్టుకుని దిగుబడులు ఇస్తుంది. మార్టేరు వరి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా రూపొందించిన వంగడాలు ఎంటీయూ 1273, ఎంటీయూ 1293 మినీకిట్ల దశలో ఉన్నాయి.
ఎంటీయూ 1318పై ఆసక్తి : ఖరీఫ్ సాగుకు ఎంటీయూ 1318 రకం వంగడాన్ని రైతులు ఎక్కువగా సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రకం వంగడాల్ని విత్తనాల కోసం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఇటీవల స్వర్ణ వంగడాన్ని మళ్లీ అధికంగా సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. స్వర్ణ రకం బియ్యాన్ని స్థానికంగా వినియోగించేందుకు ప్రజలు ఇష్టపడటంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటు ప్రైవేట్ విత్తనం సంపద స్వర్ణ వంగడాన్ని కూడా సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ విత్తన శాంపిల్స్ పరీక్షలను వ్యవసాయశాఖ అధికారులు చేపట్టనున్నారు. న్యూస్రీల్ జిల్లాలో 5 వేల భూసార పరీక్షల లక్ష్యం
ఖరీఫ్ సీజన్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
ఎంటీయూ 1318 వంగడానికి మొగ్గు
ప్రణాళికాబద్ధంగా ఖరీఫ్ సాగు
ఖరీఫ్ సాగును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు భూసార పరీక్షలతో పాటు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాల పరీక్షలకు శాంపిల్స్ సేకరణను త్వరలో చేపడతాం. ఖరీఫ్కు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి. రబీ మాసూళ్లు పూర్తయిన వెంటనే ప్రణాళికాబద్ధంగా ఖరీఫ్ సాగుకు వెళతాం.
– జెడ్.వెంకటేశ్వర్లు,
వ్యవసాయశాఖ జేడీ, పశ్చిమగోదావరి జిల్లా