మద్దిలపాలెం : ఆధ్యాత్మిక భావంతోనే ఆత్మ జ్ఞానం సాకారమవుతుందని, శివనామస్మరణతోనే పాపాల నుంచి విముక్తికి అవకాశం ఉంటుందని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికిపాటి నరసింహారావు తెలిపారు. నాలుగు రోజులుగా విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఆకాశ దీపం–కాశీ ఖండంపై నిర్వహిస్తున్న ప్రవచనాలు శుక్రవారం ముగిశాయి. దేవస్థానాల్లో రామకృష్ణ పరమ హంస వంటి వారికే పూర్ణ కుంభంతో స్వాగతం పలకాలని గరికిపాటి అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు బాధ్యతతో మెలగాలన్నారు. పిల్లలు తల్లిదండ్రుల రుణం తీర్చికోవాలని సూచించారు. అహం తగ్గించుకుని మనసులో జ్ఞాన దీపం వెలిగించుకోవాలన్నారు. విద్యారంగంలో ఒత్తిడి కారణంగానే యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.ఎన్.ఆర్.గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.