జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ
డాబాగార్డెన్స్: ఇండస్ ఆస్పత్రిని గురువారం జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తనిఖీ చేశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని ఆస్పత్రి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి మొదటి అంతస్తులోని లాపరోస్కోపిక్ ఆపరేషన్ థియేటర్లోని ఎలక్ట్రికల్ ప్యానల్ బాక్స్ వద్ద సుమారు 11.20 గంటల ప్రాంతంలో పొగలు చిమ్మి అగ్ని ప్రమాదం సంభవించిందని, అప్పుడే ఓ ఆపరేషన్ పూర్తి చేసి వచ్చానని గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జన్ డాక్టర్ ఎస్ శ్రీధర్ కమిషనర్కు వివరించారు. ఒక రోజు ముందే ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. పొగలు ఎక్కువగా రావడం, వెంటిలేషన్ లేకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడిందని, అయినప్పటికీ 45 నిమిషాల్లోనే సత్వర చర్యలు తీసుకున్నామని జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్.రేణుకయ్య, రీజినల్ ఫైర్ ఆఫీసర్ హనుమంతరావు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రిలో వెంటిలేషన్కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో అన్ని ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో తనిఖీ చేసి నివేదిక అందజేయాలని రీజినల్ ఫైర్ ఆఫీసర్ను ఆదేశించారు. జీవీంఎసీ కార్యనిర్వహణాధికారి పీవీవీ సత్యనారాయణరాజు, ఈఈ సంతోషి, ఏసీపీ వినయ్ప్రసాద్, ఏఎంవోహెచ్ డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు.