ఉత్సాహంగా సీఎం బాక్సింగ్ స్టేట్ చాంపియన్షిప్
బీచ్రోడ్డు: సాగర తీరంలో సూపర్ పంచ్లు సందర్శకులను అలరించాయి. ఒకరి మీద ఒకరు దూకుడిగా పంచులు విసురుతో నువ్వా నేనా అన్నట్లు ఎంతో ఉత్సాహంగా బాక్సింగ్ పోటీల్లో తలపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు కాయల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సీఎం బాక్సింగ్ స్టేట్ చాంపియన్షిప్ పోటీలు మంగళవారం వైఎంసీఏ వద్ద ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాయల వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని గత మూడేళ్లగా బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి బాక్సర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో మరిన్ని క్రీడా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జన్మదినమైన 21వ తేదీన పోటీల్లో విజేతలకు ట్రోఫీ, నగదు ప్రోత్సాహాకాలు అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి పాల్గొంటారన్నారు.
క్రీడాకారులకు సువర్ణావకాశం
సీఎం జగన్ పుట్టినరోజున పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ పోటీలు క్రీడాకారులకు ఒక సువర్ణ అవకాశామని జీసీసీ ఛైర్పర్సన్ శోభా స్వాతిరాణి అన్నారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ఇదో చక్కని అవకాశం అన్నారు.
150 మంది క్రీడాకారులు, 12 విభాగాలు
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరికి 12 విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. యూత్, జూనియర్ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
తొలి రోజు 26 బౌట్లు
తొలిరోజు మూడు విభాగాల్లో 26 బౌట్లు నిర్వహించారు. యూత్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. సందర్శకులకు ఎంతో ఆసక్తిగా మ్యాచ్లను తిలకించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఆంధ్ర బాక్సింగ్ అసొసియేషన్ కార్యదర్శి ఎంఎస్ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.