అధికారులను ఆదేశించిన
టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి 1.50 లక్షల ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేయాల్సి ఉందని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 11,164 టిడ్కో గృహాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి టిడ్కో సర్కిల్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులు, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్స్ ఆఫ్ బ్యాంక్ లింకేజ్ ప్రతినిధులతో టిడ్కో గృహాల నిర్మాణాలపై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని చైర్మన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీతకాల వ్యవధిలో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలావరకు టిడ్కో గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా యుద్ధప్రాతిపదికన ఈ నెలాఖరు లేదా రాబోయే జనవరి నెలాఖరు నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణాలు పూర్తిచేసుకోనున్న 11,164 టిడ్కో ఇళ్లను సకల సదుపాయాలతో లబ్ధిదారులకు అందించేందుకు ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జీవీఎంసీ పరిధిలో 4,082, అనకాపల్లి జిల్లాలో 2,744, విజయనగరం జిల్లా సారిపల్లిలోని 352, సోనియానగర్లో 1,088, సాలూరులో 1,248, శ్రీకాకుళం జిల్లా పలాసలోని 912, ఇచ్ఛాపురంలో 192, ఆమదాలవలసలో 548 ఇళ్లకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రసన్నకుమార్ సూచించారు. ఈ సమీక్షలో క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ ఎం.వెంకటేశ్వరరావు, టిడ్కో ఎస్ఈలు నరసింహమూర్తి, రామిరెడ్డి, ఇంజినీరింగ్ అదికారులు మూడు జిల్లాల సీఎల్టీసీ సభ్యులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.