● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
లక్కవరపుకోట: ఎన్నికలు సమీపిస్తుండడంతో కొన్ని దుష్టశక్తులు, ప్రతిపక్షాలు, కొన్ని మీడియా చానల్స్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ‘జయహో జగనన్న’ నినాదంతో జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో చేపట్టిన తిరుమల పాదయాత్రకు ఎల్.కోట సమీపంలో గురువారం సంఘీభావం తెలిపారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు చేస్తున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. డిసెంబర్ 21 జగన్మోన్రెడ్డి పుట్టినరోజు నాటికి తిరుమల శ్రీవారి పాదాల చెంతకు రఘురాజు క్షేమంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రఘురాజుతోపాటు రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, డీసీసీబీ చైర్మన్ వేచలపు చిన్నరామునాయుడు, ఎల్.కోట, వేపాడ, ఎస్.కోట ఎంపీపీలు, పార్టీ మండలాధ్యక్షులు పాల్గొన్నారు.