విజయనగరం ఫోర్ట్: ప్రజలకు 104 ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతున్నట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు తెలిపారు. 104 వాహన సేవల్లో జిల్లాకు రాష్ట్రస్థాయిలో రెండోస్థానం లభించింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా చీరాలలో ఈ నెల 15వ తేదీన జరిగిన 104 అరబిందో ఎమర్సెన్సీ మెడికల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి సదస్సులో జిల్లా సిబ్బంది జ్ఞాపికను అందుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓను 104 సిబ్బంది ఆయన చాంబర్లో సోమవారం కలిశారు. సిబ్బంది సేవలను అభినందించారు. మరింత ఉత్తమ సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో 104 జిల్లా మేనేజర్ నజీర్ హుస్సేన్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ కె.సంతోష్కుమార్, 108 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే పరేడ్కు కళ్యాణికి పిలుపు
విజయనగరం అర్బన్: ఢిల్లీలో జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్కు విజయనగరం పట్టణంలోని మహారాజా అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్ సారపెంట కళ్యాణికి పిలుపు అందింది. ఆంధ్రాయూ నివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.హరనాథ్ నుంచి కళాశాలకు ఎంపిక ఉత్తర్వులు అందినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో సెప్టెంబర్ 15న జరిగిన పోటీల్లో ప్రతిభ చూపడం, కె.ఎల్.యూనివర్సిటీలో నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగిన వెస్ట్జోన్ సెలెక్షన్స్లో రాణించడంతో కళ్యాణిని ఎంపిక చేశారన్నారు. రాష్ట్రం నుంచి 10 మంది వలంటీర్లను ఎంపికచేయగా ఆంధ్రా యూనివర్సిటీ తరఫున ఎంపికై న ఇద్దరిలో కళ్యాణి ఒకరని పేర్కొన్నారు. జిల్లా తరఫున రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపికైన మొట్టమొదటి వలంటీర్గా గుర్తింపు లభించిందన్నారు. కళ్యాణిని మాన్సాస్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ డాక్టర్ కె.వి.ఎల్.రాజు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు, ఎన్ఎస్ఎస్ పీఓ జి.చంద్రశేఖర్, తదితరులు అభినందించారు.
టిడ్కో కాలనీ పరిశీలన
పార్వతీపురం టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం పర్యటించారు. అడ్డాపుశీల గ్రామంలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించారు. అనంతరం పార్వతీపురం పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2018లో ప్రారంభించిన టిడ్కో గృహాలు 2020లో లబ్ధిదారులకు అందజేయాల్సి ఉండగా ఇప్పటికీ అప్పగించకపోవడం విచారకరమన్నారు. కొమరాడ మండలంలోని పూర్ణపాడు–లాబేసు వంతెన నిర్మాణం కూడా అసంపూర్తిగానే ఉందన్నారు. ఆమె వెంట పార్టీనాయకుడు డి.శ్రీనివాసరావు ఉన్నారు.
పరీక్షలంటే భయపడొద్దు
కొమరాడ: పరీక్షలంటే భయం వీడాలని విద్యార్థులకు డీఐఈఓ మంజుల వీణ సూచించారు. కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు సోమవారం నిర్వహించిన మేథ్స్టాలంట్ టెస్టును పరిశీలించారు. పరీక్షలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం కళాశాల రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో పిన్సిపాల్ వై.నాగేశ్వరరావు పాల్గొన్నారు.