కనులపండవగా
శోభాయాత్ర..
జిల్లాకేంద్రంలో మంగళవారం సాయంత్రం శ్రీలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి శోభాయాత్ర కనులపండువగా సాగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి ప్రత్యేకంగా ముస్తాబుచేసిన వాహనంలో ఉంచి ఊరేగించారు. మర్రికుంట రామాలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు పుర వీధుల్లో సాగింది. మేళతాళాలు, కోలాటాలు, కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వనపర్తి: కొత్త పూత, కాత రుచులతో కొత్త సంవత్సరం ఆరంభమవుతూ కొంగొత్త ఆలోచనలకు తెర తీస్తుంది. ఉగాది పండుగ తెలుగుజాతికి మాత్రమే ప్రత్యేకం. పండుగ రోజున షడ్రుచులున్న పచ్చడిని సేవించడం ఆనవాయితీ. పచ్చడిలో పులుపు (ఆమ్లం), తీపి (మధురం), వగరు (కషాయం), చేదు (పిత్తం), కారం (కటువు), ఉప్పు (లవణం) గుణాలతో కూడిన వేప పువ్వు, లేత మామిడికాయ, బెల్లం, చింతపండు, ఉప్పు, కారంతో పచ్చడి తయారు చేయడం ప్రత్యేకత.
● ఉగాది పండుగను పురస్కరించుకొని జిల్లాలోని ఆలయాలు రంగురంగుల విద్యుద్దీపాలు, పచ్చటి తోరణాలు, వివిధ రకాల పూలతో మంగళవారమే ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో కొనసాగుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో బుధవారం ఉదయం 5.30 గంటల నుంచే స్వామివారి సుప్రభాతసేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6.30 గంటలకు వేదపండితులు ఓరుగంటి నాగరాజుశర్మ, గోపాలశర్మ పంచాంగ శ్రవణం ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ రఘునాథశర్మ వెల్లడించారు. సాయంత్రం వేళ పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఉగాది పండుగ సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని వ్యాపార దుకాణాలు జనంతో రద్దీగా కనిపించాయి. ప్రధాన కూడళ్లలో పూలు, మామిడి ఆకుల విక్రయాలు కొనసాగాయి.
నేడు ఉగాది.. ఆలయాలు ముస్తాబు
కిక్కిరిసిన దుకాణాలు
జిల్లాకేంద్రంలో కనులపండువగా సాగిన శోభాయాత్ర