పట్టువస్త్రాల తయారీలో అమరచింత పద్మశాలీలు
నిష్టతో తయారీ..
స్వామివారి పట్టువస్త్రాలను ఉపవాస దీక్షతో నియమ నిష్టలతో తయా రు చేస్తున్నాం. తయారీలో నాకు అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా.
– మక్త మల్లేష్, నేత కార్మికుడు, అమరచింత
ఎంతో పుణ్య ఫలం..
పద్మశాలి కులస్తులు ఏటా ఉత్సవాలకు స్వామి, అమ్మ వార్ల పట్టువస్త్రాలు తయా రు చేస్తున్నారు. దేవదేవుని సేవలో పాల్గొని తరించడం ఎంతో పుణ్యం చేసుకున్నట్లుగా ఉంది. – దేవరకొండ వెంకటేశ్వరమ్మ,
నేత కార్మికురాలు, అమరచింత
ఆనందంగా ఉంది..
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు క్రమం తప్పకుండా పట్టువస్త్రాలు అందించడం అనాథిగా వస్తున్న ఆచారం. 16 ఏళ్లుగా పట్టువస్త్రాల నేత పనుల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.
– దేవరకొండ లచ్చన్న,
అధ్యక్షుడు, పద్మశాలి సంఘం
అమరచింత: పేదల తిరుపతి, భక్తుల పాలిట కొంగుబంగారమైన కురుమూర్తిరాయుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అలంకారోత్సవం నిర్వహించనున్నారు. అమరచింత పద్మశాలీ కులస్తులు తయారుచేసిన పట్టువస్త్రాలు అలంకారోత్సవం నాడు స్వామి, అమ్మవార్లకు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. 15 రోజులుగా పట్టువస్త్రాల నేత పనులు కొనసాగుతుండగా.. శనివారం భక్తిశ్రద్ధలతో ఆలయానికి తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. పట్టువస్త్రాలను అమరచింత నుంచి అమ్మాపురం ఆలయం వరకు తలపై పెట్టుకొని తీసుకెళ్లేందుకు ఆసక్తిగల పద్మశాలీల పేర్లలో లక్కిడీప్ ద్వారా ముగ్గురిని ఎంపిక చేసినట్లు సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న తెలిపారు.
ఆనవాయితీగా..
అమరచింత పద్మశాలి కులస్తులు బ్రహ్మోత్సవాల సమయంలో వస్త్రాలు తయారు చేసి సమర్పించడం ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రారంభంలో నూలు వస్త్రాలు అందజేయగా.. కాలక్రమేణ పట్టు అందుబాటులోకి రావడంతో పట్టువస్త్రాలను తయారుచేసి స్వామివారికి పంచె, గౌను, అమ్మవారికి పట్టు చీరను ప్రత్యేక మగ్గంపై నేసి సమర్పిస్తున్నారు. కులస్తులందరూ భాగస్వాములై ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరించి వస్త్రాల తయారీకి వినియోగిస్తారు.
గతంలో కోనేటిపై..
ఆరవై ఏళ్ల కిందట అమరచింత పద్మశాలి కులస్తులు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి పుష్కరిణిలోనే నీటిపై డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని మగ్గంపై వస్త్రాలు తయారుచేసి ఆలయ అర్చకులకు అందించి దేవస్థానం వారిచ్చే అతిథ్యాన్ని స్వీకరించేవారు. అప్పట్లో కోటకొండ కుర్మన్న, కొంగరి చిన్నయ్య, నరాల సింగోటం వస్త్రాలను నేసి స్వామివారికి సమర్పించేవారు.
15 రోజులు పాటు
కొనసాగిన నేత పనులు
నేడు అలంకారోత్సవంలో సమర్పణ