నర్సంపేట: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి అయింది. నర్సంపేట నియోజకవర్గంలో ఐదు నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.కృష్ణవేణి తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎస్.షణ్ముగరాజన్ సోమవారం నర్సంపేట రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 24 నామినేషన్లు దాఖలు కాగా 19 నామినేషన్లు ఆమోదం పొందగా, ఐదు నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించడం జరిగిందన్నారు. వీరిలో గటిక అజయ్కుమార్ భారతీయ జనతా పార్టీ, షేక్ ఆర్షియా ఆదాబ్ పార్టీ, జంపాల వీరస్వామి తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ, ఇమ్మడి బాబు, బోడ అనిల్కుమార్ స్వతంత్రులను స్క్రూటినిలో తొలగించడం జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఓ విశ్వప్రసాద్, వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో ఆరు..
వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులను తిరస్కరించడం జరిగిందని వర్ధన్నపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. సోమవారం నామినేషన్ల పరిశీలనలో భాగంగా మొత్తం 26 మంది అభ్యర్థులు ఉండగా వివిధ కారణాలతో ఆరుగురు అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు, బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్, బీజేపీ అభ్యర్థి కొండేటి శ్రీధర్, బీఎస్పీ అభ్యర్థి వడ్డెపెల్లి విజయకుమార్ల నామినేషన్లు ఆమోదంతో పాటు 16 మంది చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అశ్విని తానాజీ వాకడే తెలిపారు. కాగా వర్ధన్నపేట ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాన్ని సోమవారం కేంద్ర ఎన్నికల పరిశీలకుడు షణ్ముగరాజన్ సందర్శించి స్క్రూటిని ప్రక్రియను పరిశీలించారు. అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 37 మంది అభ్యర్థుల నామినేషన్లకు గాను ఆరుగురి అభ్యర్థుల నామినేషన్లను తిరిస్కరించారు. పరకాల నియోజకవర్గంలో 41 నామినేషన్లకు గాను 5 నామి నేషన్లను తిరస్కరించినట్లు ఆర్ఓలు తెలిపారు.