నామినేషన్ల
ఘట్టం...
సాక్షిప్రతినిధి, వరంగల్:
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరనుంది. ఈనెల 3న నోటిఫికేషన్ విడుదల కాగా.. అదే రోజు నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. ఈనెల 3 నుంచి 10 వరకు సాగిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం.. బుధవారం ఉపసంహరణలతో ముగిసింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 215 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అన్ని స్థానాల నుంచి తలపడుతుండగా.. బీఎస్పీ, ఏఐఎఫ్బీ, సీపీఎంతో పాటు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా వరంగల్ తూర్పు నుంచి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అత్యల్పంగా ములుగు నుంచి 11 మంది అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా.. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా 12 రోజులే గడువు ఉండడంతో గురువారం నుంచి మరింత హోరెత్తించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.
12 సెగ్మెంట్లలో ముక్కోణపు పోటీ..
ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముక్కోణపు పోటీ ఉండనుంది. వరంగల్ పశ్చిమ నుంచి కాంగ్రెస్ రెబల్గా పోటీచేసిన డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి నామినేషన్ను ఉపసంహరించుకోగా, వరంగల్ తూర్పు నుంచి బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజనాల శ్రీహరి కూడా తప్పుకున్నారు. బీఆర్ఎస్ నుంచి సీనియర్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, డీఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి తదితరులు మరోసారి విజయం కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తదితరులు పోటీలో ఉండగా, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, జి.విజయరామారావుతో పాటు చందుపట్ల కీర్తిరెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్రావు తదితరులు తలపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా.. ముక్కోణపు పోటీలో మునిగేదెవరు? తేలేదెవరు? అనే చర్చలు జోరందుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసి, గుర్తుల కేటాయింపు ప్రక్రియ తర్వాత గెలుపు, ఓటములపై నియోజకవర్గాల వారీగా జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి.
మరోసారి అగ్రనేతలు..
హోరెత్తనున్న ప్రచారం..
ఉమ్మడి వరంగల్లో గురువారం నుంచి ప్రచారం మరింత హోరెత్తనుంది. ఇదివరకే పలుమార్లు ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని నిర్వహించిన ప్రధాన పార్టీల అగ్రనేతలు మళ్లీ శుక్రవారం నుంచి ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 17న పరకాలలో ప్రచారం నిర్వహించనుండగా.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ అదే రోజు వరంగల్, పరకాల, నర్సంపేటలో పర్యటించనున్నారని ఆయా పార్టీల వర్గాలు ప్రకటించాయి. బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్షా కూడా 18 నుంచి ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు నేతలు ప్రకటించారు. ఈ నెలాఖరున జరిగే శాసన సభ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ఈ ప్రచారాలను నిర్వహించనున్నాయి. ఇప్పటికే 15 రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ పదేళ్లుగా ఉమ్మడి వరంగల్లో చేపట్టిన, వచ్చే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధిని ఓటర్ల ముందుంచే ప్రయత్నం చేస్తూ.. రైతుబంధు, దళితబంధు, ఆసరాతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఐదు సభలు నిర్వహించి వచ్చే ఐదేళ్లలో చేపట్టేబోయే అభివృద్ధి పథకాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించిన ఆరు హామీలను నియోజకవర్గాలు, గ్రామాల వారీగా ప్రణాళిక ప్రకారం ఓటర్ల ముందుకు తీసుకెళ్తున్నారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, మహాలక్ష్మి కింద ప్రతి నెలా రూ.2500, వృద్ధులకు పింఛనుగా రూ.4వేలు.. ఇలా ఆరు హామీలను జనంలోకి తీసుకెళ్తున్నారు. బీజేపీ కేంద్రమంత్రులు, అగ్రనేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు టార్గెట్గా విమర్శలు చేస్తూ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు.
వరంగల్ పశ్చిమ
పరకాల
భూపాలపల్లి
నియోజకవర్గం బరిలో నిలిచింది
వరంగల్ తూర్పు 29
పశ్చిమ 15
పరకాల 28
వర్ధన్నపేట 14
నర్సంపేట 16
జనగామ 19
పాలకుర్తి 15
స్టేషన్ఘన్పూర్ 19
భూపాలపల్లి 23
మహబూబాబాద్ 12
డోర్నకల్ 14
ములుగు 11
12 సెగ్మెంట్ల నుంచి బరిలో 215 మంది అభ్యర్థులు
నేటి నుంచి పతాకస్థాయికి
ప్రధాన పార్టీల ప్రచారం
వ్యూహాలు, ప్రతివ్యూహాలతో
దూసుకెళ్తున్న అభ్యర్థులు
రేపు రాహుల్గాంధీ, సీఎం కేసీఆర్, ఎల్లుండి అమిత్షా పర్యటన