ఎన్నికల పరిశీలకుడు గోపాలకృష్ణ
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్.ఎన్ గోపాలకృష్ణ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో గోపాలకృష్ణ, పోలీస్ అబ్జర్వర్ తోగో ఖర్గా, ఎన్నికల ఖర్చుల అబ్జర్వర్ రాహుల్ పంజాబ్రావ్గవండే హాజరై ఎన్నికలకు సంబంధించిన వివిధ శాఖలు ఇప్పటి వరకు చేపట్టిన కార్యాచరణ గురించి అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో సీపీ అంబర్ కిషోర్ ఝా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రెయినీ కలెక్టర్ శ్రద్ధా శుక్ల, అదనపు కలెక్టర్ మహేందర్జీ, సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ, డీఆర్ఓ వై.వీ గణేశ్, డీఈఓ అబ్దుల్ హై తదితరులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్ పరిశీలన
కలెక్టరేట్లో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్, వీడియో సర్వేలెన్స్ సిస్టం కేంద్రాన్ని జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ హెచ్ఎన్ గోపాలకృష్ణ, పోలీస్ అబ్జర్వన్ తోగో కర్గా, ఎన్నికల ఖర్చుల అబ్జర్వర్ రాహుల్ పంజాబ్రా గవండే పరిశీలించారు. కార్యక్రమంలో సీపీ అంబర్ కిషోర్ ఝా తదితరులు ఉన్నారు.
ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి
వరంగల్ అర్బన్: తూర్పు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎస్.షణ్ముఘరాజన్, పోలీసు పరిశీలకులు రాజేశ్కుమార్, ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్ ప్రతీప్సింగ్ అన్నారు. గురువారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో తూర్పు రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ఏజెంట్ల సమావేశంలో ఎన్నికల నియమావళి వివరాలు వెల్లడించారు.