నరసాపురం రూరల్: నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో సార్వా వరి సాగులో అక్కడక్కడా జింక్ లోపంతో పాటు కాండం తొలిచే పురుగు, అగ్గితెగులు కనిపిస్తున్నాయి. అయితే వీటి ఉధృతి పెరగకుండా తెగులు సోకిన వెంటనే నివారణ చర్యలు పాటిస్తే పంట దిగుబడిపై ప్రభావం పడకుండా ఉంటుంది. వీలైనంత వరకు పురుగుమందుల వినియోగించకుండా పొలంబడిలో సూచించే సూచనలు లేదా వ్యవసాయాధికారుల సలహాలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. వేయాల్సిన ఎరువులు వేసినప్పటికీ జింక్ లోపం వల్ల మొక్క ఎదుగుదల లోపించి దుబ్బు చేయదు. పాత ఆకులపై తుప్పు రంగు మచ్చలు కనిపిస్తుంటాయి. మొక్కపై నుంచి మూడు లేదా నాలుగు ఆకులలో మధ్య ఈనె పాలిపోతుంది. ఇరు పక్కలా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. దీని నివారణకు గాను ఎకరానికి జింకు సల్ఫేట్ 400 గ్రాముల మందును లేదా జింకు ఈడీటీఏ 21 శాతం లేదా 33 శాతం మందును 400 గ్రాముల మందును పిచికారీ చేయడం వల్ల ఈ తెగుళ్లను నివారింకోవవచ్చు.
అగ్గి తెగులు
ఆకులపై ముదురు గోధుమరంగు అంచుతో మధ్యలో బూడిద రంగు ఉండే నూలు కండె ఆకారపు మచ్చలు, ఆకులు ఎండి తగులబడినట్లు కనబడడం వల్ల ఈ తెగులును అగ్గితెగులు అంటారు. ఈ తెగులు వెన్ను, మెడ బాగంలో ఆశిస్తే వెన్ను విరిగి వాలిపోతుంది. దీనినే మెడ విరుపు అంటారు. ఈ తెగులు సోకడం వల్ల సగం నిండిన గింజలు, తాలు ఏర్పడతాయి. దీని నివారణకు వ్యవసాయాధికారుల సూచనల మేరకు నత్రజని అందించే ఎరువులను తకువ మొతాదులో వాడిలి. అగ్గి తెగులు నివారణకు లీటరు నీటికి ట్రై సైక్లోజోల్ 75 శాతం మందును 0.6 గ్రాములు, లేదా ఐసో ప్రోథియోలిన్ 40 శాతం మందును 1.5మిల్లీ లీటర్లు మందును, లేదా కాసుగా మైసిన్ 3 శాతం మందును 2.5 మిల్లీ లీటర్లు చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. దీంతోపాటు తెగులును తట్టుకునేందుకు గట్లపైన కలుపును సకాలంలో నివారించాలి.
కాండం తొలుచు పురుగు
నారు మండి దశ నుంచి ఈనిక దశ వరకూ వరి పంటను కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. పిలకలు తొడిగే దశలో ఆశిస్తే మొవ్వులు ఎండిపోయి చనిపోతుంది. పూత దశలో అయితే వెన్నులు తెల్ల కంకులుగా మారిపోయి నిరుపయోగంగా ఉంటుంది. చనిపోయిన కంకులను లాగితే సులువుగా బయటకు వస్తుంది.
దీని నివారణకు లీటరు నీటికి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50ఎస్పీ మందును 2 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 20ఎస్పీ మందును 0.4 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేయాలి. చీడపీడల ఉధృతిని పరిశీలించి అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో మరోసారి పైన సూచించన మందులను పిచికారీ చేసుకోవచ్చునని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వంతుల వారీ విధానం అమలులో ఉన్నందున రైతుల పొలాల్లో నీటి యాజమాన్యాన్ని పాటించడం వల్ల దిగుబడిని పెంపొందించుకోవచ్చును.
నివారణకు మందును పిచికారీ చేస్తున్న రైతు.
జింక్లోపానికి గురైన వరి ఆకు
దాళ్వా వరి సాగులో తెగుళ్లు
నివారణకు సూచనలిస్తున్న వ్యవసాయాధికారులు
వ్యవసాయాధికారుల సూచనల మేరకే
రైతులు ఏదైనా తెగులు, పురుగు గుర్తించిన వెంటనే రైతు భరోసా కేంద్రాన్ని లేదా వ్యవసాయాధికారులను గానీ సంప్రదించి వారి సూచనల మేరకే సంబంధిత మందులను వినియోగించాలి. ప్రస్తుతం వంతుల వారీ విధానం అమలు ఉన్నందున వంతు సమయంలో నీటి ఎద్దడి ఎదురైతే 08816–234197 నెంబరుకు సమస్యను వివరించి పరిష్కారం పొందవచ్చు. – ఈదా అనిల్కుమారి, సహాయ వ్యవసాయ సంచాలకులు, నరసాపురం