నరసాపురం రూరల్: వేర్వేరు ప్రాంతాల్లోని పంటకాలువల్లో వృద్ధులైన ఇద్దరి మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. మొగల్తూరు మండలంలోని వారతిప్ప కాలువలో సోమవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించగా, స్థానికులు మొగల్తూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ నెల 10వ తేదీన భీమవరం పట్టణానికి చెందిన కడలి శశిరేఖ (90) ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారతిప్పలో లభ్యమైన మృతదేహం శశిరేఖదిగా గుర్తించినట్లు ఇన్చార్జి ఎస్సై గురవయ్య తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేస్తామని పోలీసులు తెలిపారు.
పెదమామిడిపల్లిలో..
పాలకొల్లు అర్బన్: పెదమామిడిపల్లిలోని పంటబోదెలో వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. నరసాపురం మండలం మల్లవరం లంకకు చెందిన దిడ్ల కమల (60) మతి స్థిమితం కోల్పోయింది. రెండు రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆమె ఆచూకీ దొరకక నరసాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం పెదమామిడిపల్లి పంటబోదెలో మృతదేహం లభ్యమైన విషయాన్ని కుమారులకు తెలియజేయడంతో వారు వచ్చి తల్లి మృతదేహాన్ని గుర్తించారు. పెదమామిడిపల్లి వీఆర్వో పాలంకి భుజంగరావు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఎస్.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జూదరుల అరెస్ట్
ద్వారకాతిరుమల: జి.కొత్తపల్లి శివారులోని ఓ తోటలో పేకాట శిబిరంపై ఆదివారం దాడి చేసి పది మంది జూదరులను అరెస్టు చేసినట్లు ఎసై టి.సుధీర్ చెప్పారు. వారి నుంచి రూ.37,100 నగదుు, 7 బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.