భీమవరం(ప్రకాశం చౌక్): బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళి బాలికల అభ్యున్నతికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం స్థానిక ఏఎస్ఆర్ నగర్ అల్లూరి సీతారామరాజు కళా కేంద్రంలో బేటీ బచావో బేటీ పడావో వర్క్ షాప్లో కలెక్టరు పి.ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లను చదివిద్దాం అనే సందేశాన్ని ఆచరించి, సమాజానికి అందరికీ తెలిసేలా చేసినప్పుడే మార్పు ఉంటుందన్నారు. నెలసరి పరిశుభ్రతపై ప్రతి బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడా బాల్య వివాహాల కేసు నమోదు కాకూడదన్నారు. బడిఈడు పిల్లలు బడిలోలే ఉండాలన్నారు. ముందుగా కలెక్టరు జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ ను ప్రారంభించారు. బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆడపిల్లను రక్షిద్దాం ఆడపిల్లను చదివిద్దాం పోస్టర్లను కలెక్టరు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకట రమణ, ఐసీడీఎస్ పీడీ బి.సుజాత రాణి, డీసీపీఓ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్ర వేణి తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు
భూ హక్కు పత్రాలు
భీమవరం(ప్రకాశం చౌక్): అసైన్డ్ భూముల లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు అందించేందుకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా జాయింటు కలెక్టరు చాంబర్లో 9 అంశాలపై సంబంధిత అధికారులతో జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి సమీక్షించారు. లంకా లాండ్సు, ఫ్రీ హోల్డ్ రైట్స్, ఇనాం భూములు, షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాలో బరియల్ గ్రౌండ్స్, కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కార్పొరేషన్ భూములు, స్వమిత్వ, రీ సర్వే ఫేజ్–2, ఎన్పీఐ హౌస్ సైట్స్ తదితర 9 అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో లంక భూములు ఆచంట, పెనుగొండ, యల మంచిలి మండలాలు 823 ఎకరాలు 1,181 మంది లబ్ధిదారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో డిప్యూటీ ట్రైనీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, కలెక్టరు కార్యాలయం సూపరింటెండెంట్ ప్రసాదు, కలెక్టరేటు ల్యాండు సూపరింటెండెంట్ సీహెచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
టిడ్కో ఇళ్ల వద్ద సమావేశాలకు అనుమతి లేదు
పాలకొల్లు సెంట్రల్: పట్టణ శివారు ప్రాంతం పెంకుళ్లపాడు వద్ద ఉన్న టిడ్కో గృహాల వద్ద జరప తలపెట్టిన రెండు పార్టీల సమావేశాలకు అనుమతులు లేవని పట్టణ సీఐ ధారావతు రాంబాబు తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ చలో టిడ్కో హౌసెస్, వాస్తవాల వడ్డన కార్యక్రమం, టీడీపీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారని.. రెండు పార్టీల నాయకులు ఒకే రోజు ఒకే ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఇరు పార్టీల నాయకులకు సూచించామన్నారు. నేటి సమావేశాలకు అనుమతి లేదన్నారు.
దిశ యాప్ డౌన్లోడ్తో డిస్కౌంట్లు
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో దిశ పోలీసులు మహిళలకు వినూత్నమైన రీతిలో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏలూరు జిల్లా ఎస్పీ డీ.మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో దిశ డీఎస్పీ నున్న మురళీకృష్ణ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దుస్తులపై డిస్కౌంట్ ఇచ్చేలా ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వన్టౌన్లోని చందన బ్రదర్స్ షోరూమ్లో 10 శాతం, ఏలూరు కొత్తబస్టాండ్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో 10 శాతం, ఏలూరు ఆర్ఆర్పేటలో జీవీ మాల్లో 5 శాతం, ఏలూరు పత్తేబాద డీమార్ట్ పక్కన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 5శాతం మేర డిస్కౌంట్ ఇస్తారు.