భీమవరం(ప్రకాశం చౌక్): జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గుర్తించిన వారికి నవంబర్ 18 నుంచి ఆపరేషన్లు ప్రారంభించాలని కలెక్టర్ పి.ప్రశాంతి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ వైద్యాధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ 1,584 మందిని తదుపరి చికిత్స నిమిత్తం రిఫర్ చేశామని, వీరిలో 356 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని చెప్పారు. మిగతా వారికి రానున్న రెండు రోజుల్లో పరీక్షలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 985 మందికి తదుపరి వైద్య సాయం అవసరమని గుర్తించగా, వారిలో 560 మందికి సాధారణ సర్జరీలు నిర్వహించడం, మిగిలిన వారికి నెలవారీ మందులను అందజేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే 25 మందికి సర్జరీలు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సర్జరీలకు షెడ్యూల్ రూపొందించి, ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రిన్సిపాల్స్ గైర్హాజరుపై ఆగ్రహం
సాక్షి, భీమవరం: ఇంటర్ ఉత్తీర్ణత పెంచడానికి భీమవరం కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశానికి అనేక ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్ రాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఉత్తీర్ణత కాని విద్యార్థులు తప్పనిసరిగా ఏదొక కోర్సులో చేరేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. చదువు మానేసినవారి ఆసక్తిని తెలుసుకుని తిరిగి కళాశాలలో లేదా ఓపెన్ స్కూల్లో చేరేలా, చదువుపై ఆసక్తి లేని వారికి వృతి విద్య శిక్షణలో చేర్పించాలన్నారు. ఆడుదాం ఆంధ్రాకు ఏర్పాట్లు చేయండి
సాక్షి, భీమవరం: ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో పోటీల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించిన సందర్బంగా ఆమె మాట్లాడారు. ప్రతి గ్రామంలో వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్ ఆటలను తప్పనిసరిగా నిర్వహించాలని దీనికి 15 ఏళ్లు నిండిన బాలబాలికల జట్లను సిద్ధం చేయాలన్నారు.
కలెక్టర్ ప్రశాంతి