బీబీనగర్ : పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు, రైతులందరూ ఒక చోట సమావేశమై వ్యవసాయరంగంపై చర్చించుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఏర్పా టు చేసిన రైతువేదికలు ఊరి చివరన గ్రామాలకు దూరంగా నిర్మించడంతో నిరుపయోగంగా మారాయి. మండలంలోని మొత్తం 34గ్రామ పంచాయతీలు ఉండగా వాటికి అదనంగా మరో 16కు పైగా ఆవాస గ్రామాలు ఉన్నాయి. కాగా వ్యవసాయశాఖ అధికారులు మండలంలోని బీబీనగర్, బ్రహ్మణపల్లి, రాయరావుపేట, పడమటిసోమారం గ్రామాలను క్లస్టర్గా ఏర్పాటు చేసి రైతు వేదికలను నిర్మించారు.
రైతుల అనాసక్తి..
క్లస్టర్ల వారీగా ఒక్కో రైతువేదిక భవనాన్ని సుమారు రూ.22 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ రైతు వేదికలను ఏడాది క్రితమే ప్రారంభించారు. కానీ క్లస్టర్కు పలు గ్రామాలు 3 కిలోమీటర్ల దూరం నుంచి 8కిలోమీటర్ల దూరం ఉన్నాయి. దీంతో ప్రతి బుధవారం, శుక్రవారం రైతు వేదికల్లో ఏర్పాటు చేసే అవగాహన సదస్సులకు రావడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. జన సంచారం లేని చోట రైతు వేదికలు నిర్మించడంతో వ్యవసాయ అధికారులు సైతం రైతు వేదికలకు వెళ్లకుండా గ్రామాల్లో ఫీల్డ్ విజిట్ చేసి విధులు పూర్తి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఊరికి దూరంగా ఉన్న రైతు వేదికలు అ సాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. సంబంధిత అధికారులు కూడా రైతువేదికలను పట్టించుకోకపోవడంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతువేదికలు అలంకార ప్రాయంగా మారుతున్నాయని పలువురు వాపోతున్నారు.
3 నుంచి 8 కిలో మీటర్ల దూరంలో
ఉన్న భవనాలు
అవగాహన సదస్సులకు వెళ్లడానికి ఆసక్తి చూపని రైతులు