నకిరేకల్ : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వ్యవసాయ పథకాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభించారు. తొలుత చందుపట్ల గ్రామస్తులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు వేదిక భవనంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు అంతకు ముందు ఉన్న పరిస్థితులను పరిశీలన చేసుకోవాలని చెప్పారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రైతులకు పెట్టుబడుల కోసం గతంలో అప్పులు తెచ్చి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునేవారని, నేడు ఆ పరిస్థితి లేకుండా రైతుబంధు ప్రవేశపెట్టి వారికి సహాయం అందించడం గొప్పవిషయమని తెలిపారు.
నల్లగొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి