సాక్షి యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లాకు రానున్నారని తెలిసింది. భువనగిరి, ఆలేరు అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. యోగి పర్యటన ఖరారైనప్పటికీ ఏయే తేదీల్లో ఆయన పర్యటించేది పార్టీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.
ఆత్మకూరు(ఎం)
మండల ఏఓగా సుజాత
ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండల వ్యవసాయ ఇన్చార్జిగా అధికారికి మోటకొండూరు ఏఓ సుబ్బూరు సుజాత నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆశాఖ జిల్లా అధికారి అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఏఓగా పని చేస్తున్న శిల్ప ఇటీవల కలెక్టరేట్లో యాదగిరిగుట్ట మండలానికి చెందిన ఏఈఓ మనోజ్పై కత్తితో దాడి చేసిన ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మోటకొండూరు ఏఓను ఇన్చార్జిగా నియమించారు.
ఓటరు చైతన్యమే లక్ష్యం
భువనగిరిటౌన్ : ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా స్వీప్ విభాగంలో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటల రూపంలో ప్రజలను చైతన్యం పరుస్తున్నారు. శుక్రవారం భువనగిరి బస్టాండ్, బ్యాంకు, పలు కాలనీల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఓటు వేయాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపాలటీల్లో వంద శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటు ఆవశ్యతను వివరించడంతో పాటు ఓటు వేసేలా ప్రజల్లో చైతన్యం తెస్తున్నట్లు జిల్లా స్వీప్ నోడల్ అధికారి భట్టు నాగిరెడ్డి తెలిపారు.
ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
భూదాన్పోచంపల్లి : పట్టణలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు నందిగామ అక్షయ, ఎర్రోజు ఐశ్వర్య ఎంపికయ్యారు. ఇటీవల సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి పోటీల్లో అండర్ –17 విభాగంలో నందిగామ అక్షయ, అండర్–14 విభాగంలో ఎర్రోజు ఐశ్వర్య ఉత్తమ ప్రదర్శ కనబరిచారని పాఠశాల హెచ్ఎం ఆర్.రమాదేవి, వ్యాయామ ఉపాధ్యాయురాలు వి.కవిత శుక్రవారం తెలిపారు. త్వరలో గద్వాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.
మద్యం దుకాణాల్లో తనిఖీ
భువనగిరి క్రైం : జిల్లా కేంద్రంలోని సితార, లక్ష్మి, ఎస్.వి వైన్స్లలో శుక్రవారం ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాకేష్కుమార్ తనిఖీలు చేశారు. మద్యం విక్రయాలు, స్టాక్ రికార్డులను పరిశీలించారు. కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నిబంధన మేరకు అమ్మకాలు జరపాలని నిర్వాహకులకు సూచించారు. తనిఖీల్లో జిల్లా ఎకై ్సజ్ అధికారి నవీన్కుమార్, ఎకై ్సజ్ సీఐ నాగిరెడ్డి, ఎస్ఐ సాయి కిరన్రెడ్డి పాల్గొన్నారు.
20న హాకీ, హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు
నల్లగొండ టూటౌన్: ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి అండర్–14, 17 బాలబాలికల హాకీ, హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు ఈనెల 20న నల్ల గొండలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జి.వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9గంటలకు 10వ తరగతి మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, పూర్తి వివరాల కోసం సెల్ నంబర్ 9441463290 నంబర్ను సంప్రదించాలని కోరారు.