కడప అర్బన్ : చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను ఖాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు కార్లు, మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కడపలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఖాజీపేట మండలం భూమాయపల్లి గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి మహమ్మద్ రఫీ అలియాస్ రఫీ అలియాస్ చరణ్, ప్రొద్దుటూరు టౌన్ వాజ్పేయినగర్లో నివాసం వుంటున్న మల్లె భరత్కుమార్ ప్రొద్దుటూరు నుంచి కారులో కడప వైపు వెళ్తుండగా అరెస్ట్ చేశారు. తిమ్మారెడ్డి మహమ్మద్ రఫీపై ఇప్పటికే 40 కేసులు నమోదై ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు కార్లు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. తిమ్మారెడ్డి మహమ్మద్ రఫీపై వైఎస్ఆర్ జిల్లాలో 28, కర్నూలు జిల్లాలో 8, గుంతకల్లు రైల్వేస్టేషన్ పరిధిలో రెండు, తెలంగాణలో 4 కేసులు నమోదయ్యాయి. నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన మైదుకూరు డీఎస్పీ వంశీధర్గౌడ్, మైదుకూరు రూరల్ సీఐ నరేంద్రారెడ్డి, ఖాజీపేట ఎస్ఐ కుళ్లాయప్ప, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను జిల్లా ఎస్పీ అందజేశారు.
రూ.10.25 లక్షల బంగారు స్వాధీనం