కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం సులభతరమని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి అన్నారు. జాతీయ న్యాయసేవాధికారసంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశానుసారంగా జిల్లా న్యాయసేవాధికారసంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం కడపలోని న్యాయసేవాసదన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. 33,743 కేసులు పెండింగ్లో వున్నాయన్నారు. జాతీయలోక్ అదాలత్లో న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు పాలు పంచుకునేలా ఎప్పటికపుడు సమావేశాలను నిర్వహించి తమ వంతుగా కృషి చేశామన్నారు. జాతీయ లోక్ అదాలత్కు వచ్చిన కక్షిదారుల కోసం ఎస్బిఐ వారి సౌజన్యంతో అన్నప్రసాదాన్ని అందజేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 12876 కేసులను పరిష్కరించారు. కక్షిదారులకు 2,36,42,291 నష్టపరిహారంగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, లోక్ అదాలత్ సభ్యులు, కక్షిదారులు, వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి వారి కేసులను పరిష్కరించుకోవడం జరిగింది. కోవిడ్ –19 నియమావళిని అనుసరిస్తూ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ప్రదీప్కుమార్తోపాటు న్యాయమూర్తులు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సీ.ఎన్. మూర్తి, నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి గీతా, ప్రిన్సిపల్ సీనియర్ సీవిల్ జడ్జి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రసూన, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి భార్గవి, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జీ.వి రాఘవరెడ్డిలు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి, పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి
జిల్లాలో ఇప్పటివరకు 12876 కేసుల పరిష్కారం, కక్షిదారులకు రూ.2,36,42,291 నష్టపరిహారం