ప్రొద్దుటూరు : టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జీవీ ప్రవీణ్కుమార్రెడ్డిని పోలీసులు వెంబడించడంతో నిక్కర్(షాట్)తో పరారయ్యాడని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. తనను తాను సంరక్షించుకోలేని ప్రవీణ్ లాంటి వ్యక్తి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండటం, ఆయన వెంట తిరగడం పార్టీ కార్యకర్తలకు పట్టిన ఖర్మ అని అన్నారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. దళితుడైన వైఎస్సార్సీపీ కార్యకర్త బెనర్జీపై గత నెల 28న మధ్యాహ్నం జరిగిన హత్యాయత్నం కేసులో ప్రవీణ్ నిందితుడిగా ఉన్నాడన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలో పాల్గొనకూడదని హెచ్చరించి ఈ దాడికి పాల్పడ్డారన్నారు. నిందితునిగా ఉన్న ప్రవీణ్ను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా ఏర్పడి సీఐలు వెతుకుతున్నా అతనితోపాటు మొత్తం ముగ్గురు నిందితులు కనిపించలేదన్నారు. పోలీసుల ఎదుట హాజరై వాస్తవాలు చెప్పలేని ఇలాంటి వ్యక్తి పార్టీ ఇన్చార్జిగా ఉండటం దురదృష్టకరమన్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు రాష్ట్రం వదిలి పారిపోయాడని, పార్టీ జెండాను పట్టించుకోలేదన్నారు.
హైదరాబాద్లో ఉండగా..
గత 16 రోజులుగా పోలీసులకు కనిపించని ప్రవీణ్ గత శుక్రవారం రాత్రి హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్ రిసార్ట్లో ఉండగా పోలీసులు గుర్తించారన్నారు. అతనిని పట్టుకునేందుకు వెళ్లే సమయానికి ప్రవీణ్ మద్యం సేవిస్తూ నిక్కర్తో కనిపించాడని పేర్కొన్నారు. పోలీసులు వెంబడించడంతో దొరక్కుండా, ఒంటిపై గుడ్డలు లేకుండా పారిపోయాడన్నారు. కేవలం నిమిషాల్లోనే ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ప్రవీణ్కు ఆశ్రయం ఇచ్చిన అతని సోదరుడు ప్రదీప్ కుమార్రెడ్డిపై సెక్షన్ 212 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ సానబోయిన శేఖేర్ యాదవ్, కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, మాజీ సర్పంచ్ రమణయ్య పాల్గొన్నారు.