కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఈమేరకు రబీ సీజన్ రైతులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ విజయరామరాజు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన హాలులో రాష్ట్ర ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్ పి.శివ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ సలహా మండలి సమీక్ష సమావేశం జరిగింది. జేసీ గణేష్ కుమార్,అసిస్టెంట్ కలెక్టర్ భరధ్వాజ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుదారు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని ఆయకట్టు పరిధిలో పంటల సాగుకు అందుబాటులో ఉన్న నీటి వనరులైన బోర్లు, బావులు తదితరాలను సద్వినియోగం చేసుకుని అందుకు అనువుగా పంట రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాల్సి ఉంటుందన్నారు. కడప నగరంలో రైతు బజార్లను పెంచాలన్నారు. అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ గోడౌన్ల నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. జేసీ గణేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగు విస్తీర్ణం దిగుబడులు పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ డివిజన్ల వారీగా టార్గెట్లు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్ శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందన్నారు. రైతులు సాగు చేసేందుకు విరివిగా రుణాలు ఇప్పించేందుకు సహకరించాలని ఎల్డీఎంకు సూచించారు. జిల్లా అధికారి నాగేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరాం రెడ్డి, ఏపీఎంఐపీ పీడి రవీంద్రరెడ్డి, సీఎంఎన్ఎఫ్ (ప్రకృతి వ్యవసాయం) డీపీఎం రామకృష్ణ, ఆత్మ పీడి విజయ కుమారి, తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
జిల్లాలో ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, ప్రగతిలో వెనుకబడితే చర్యలు తప్పవని కలెక్టర్ విజయరామరాజు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్మిస్తున్న సచివాలయ భవనాలు, కేటగిరీ–2 క్రింద చేపట్టిన బీఎంసీయూలు, డిజిటల్ లైబ్రరీలు తదితర భవన నిర్మాణాల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సచివాలయాల పరిధిలో చేపట్టిన నిర్మాణ పనులను పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేసిన పనులకు సంబంధించి బిల్లుల అప్ లోడ్ విషయంలో ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా వ్యవసాయ
సలహా మండలి సమీక్షలో కలెక్టర్