Sakshi News home page

మోడీకి వీసా ఇవ్వొద్దు

Published Wed, Jul 24 2013 7:41 AM

అమెరికాలో పర్యటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆ పార్టీ నేత నరేంద్ర మోడీకి అమెరికా ఎప్పటికైనా వీసా ఇవ్వాల్సిందేనంటూ ఒకపక్క వీసా ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. మరోపక్క మోడీకి వీసా ఇవ్వొద్దంటూ 65 మంది ఎంపీలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖలు రాశారు. గుజరాత్ సీఎం మోడీకి వీసాను నిరాకరిస్తూ అమెరికా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలంటూ 12 పార్టీలకు చెందిన ఎంపీలు లేఖల్లో పేర్కొన్నారు. ఒక లేఖలో సీతారాం ఏచూరీ(సీపీఎం), అచ్యుతన్ (సీపీఐ)లతో సహా 25 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేయగా, మరో లేఖలో 40 మంది లోక్‌సభ సభ్యులు సంతకం చేశారు. ఒకే రీతిలో రాసిన ఈ రెండు లేఖలను గతేడాది నవంబరు 26న, డిసెంబరు 5న రాయగా.. తాజాగా ఆదివారం మరోసారి వైట్‌హౌజ్‌కు ఫ్యాక్స్‌లో పంపారు. లేఖల ప్రతులను ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ మంగళవారం విడుదల చేసింది. మోడీకి వీసా కోసం రాజ్‌నాథ్ యత్నిస్తున్న నేపథ్యంలో మరోసారి లేఖలను పంపామని మోడీకి వీసా నిరాకరణ ప్రచారాన్ని ప్రారంభించిన రాజ్యసభ ఎంపీ మహ్మద్ ఆదీబ్ వెల్లడించారు.