బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Published Mon, Oct 3 2016 7:16 AM

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తరఫున ఆయన సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంసంధ్యా సమయంలో విష్వక్సేనుడు.. ఛత్ర, చామర, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి తిరిగి ఆలయంలోనికి చేరుకున్నారు. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల్లోపు ధ్వజారోహణంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. తర్వాత రాత్రి 9 గంటలకు శేష వాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 11 వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఐదో రోజు రాత్రి 7.30 గంటలకే గరుడ వాహనంపై స్వామి దర్శనమివ్వనున్నారు. ఎనిమిదో రోజు రథోత్సవం, చివరి రోజు చక్రస్నానంలో స్వామి సేద తీరుతారు.