'బాబు వెంకటపాలెంనే ఎత్తుకుపోవాలని చూస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'బాబు వెంకటపాలెంనే ఎత్తుకుపోవాలని చూస్తున్నారు'

Published Tue, Nov 18 2014 2:47 PM

రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయటం వల్లే చంద్రబాబు నాయుడును గెలిపించాలమని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం రైతులు అన్నారు. అధికారంలో కూర్చొబెడితే... ఇప్పుడు ఆయన వెంకటపాలెంనే ఎత్తుకుపోవాలని చూస్తున్నారని రైతులు మంగళవారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను హైదరాబాద్ పిలిపించి మాట్లాడితే సమస్య పరిష్కారం అవదని, తమ గ్రామానికి వచ్చి తిరిగితే కష్టాలు ఏంటో తెలుస్తాయన్నారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులందరితో చంద్రబాబు నాయుడు మాట్లాడాలని వెంకటపాలెం రైతులు డిమాండ్ చేశారు. కాగా రాజధానికి భూసమీకరణలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం ఎదుట వెంకటపాలెం రైతులు సోమవారం నిరసన తెలిపారు. ఏకపక్షంగా భూసమీకరణకు అంగీకరించేది లేదని, గ్యోబాక్ అంటూ నినాదాలు చేశారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని కమిటీకి స్పష్టం చేసిన రైతులు సదస్సును బహిష్కరించి వెళ్లిపోవడంతో అభిప్రాయ సేకరణ పూర్తి చేయకుండానే కమిటీ సభ్యులు వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా రాయపూడి గ్రామ రైతులు కూడా భూములు ఇవ్వడానికి ససేమిరా అన్న విషయం తెలిసిందే.