బుల్లి పెట్టెలోకి భూ వివరాలు | Sakshi
Sakshi News home page

బుల్లి పెట్టెలోకి భూ వివరాలు

Published Thu, Dec 25 2014 12:37 AM

1954 to date a comprehensive survey

 ఏలూరు :జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించే నిమిత్తం సమగ్ర సర్వే చేపట్టేం దుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. జాతీయ భూమి రికార్డుల నవీ కరణ కార్యక్రమం (నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రాజెక్ట్) కింద తక్షణమే భూముల సర్వే చేపట్టి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సర్కారు ఆదేశించింది. సర్వేలో వెలుగు చూసిన భూముల వాస్తవ పరిస్థితుల వివరాలను కంప్యూటరీకరించాలని స్పష్టం చేసింది. అనంతరం వివరాలను ఆన్‌లైన్‌తో అనుసంధానించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కార్యక్రమం అంతా శాటిలైట్ సర్వేకు అనుగుణంగా సాగించాలంటూ మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం భూమి రికార్డులతో కుస్తీ పడుతోంది.
 
 రికార్డులు సిద్ధమేనా?
 సమగ్ర భూ సర్వేను ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో చేయాల్సి ఉంది. 1954 నుంచి 2014 వరకు అడంగల్స్ మార్పు లు, చేర్పులను సైతం నమోదు చేయా ల్సి ఉంది. అయితే, 1954 నుంచి పూర్తిస్థాయిలో రికార్డులు లభ్యమవుతాయా.. లేదా అన్న ఆందోళనలో యంత్రాంగం ఉంది. దీనికి తోడు అన్ని మండలాల్లో సర్వేయర్ల పోస్టులు భర్తీ కాలేదు. దాదాపుగా 15 మండలాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సమగ్ర సర్వేకు ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.
 
 గుబులు రేపుతున్న అసైన్డ్ భూములు
 కుకునూరు, వేలేరుపాడు విలీనం కాకముందు జిల్లాలో ఉన్న 46 మండలాల్లో 61వేల 456 మందికి 92వేల 356 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపంలోనూ ఈ తరహా భూములను పంపిణీ చేశారు. వీటిని బడా బాబులు చేపల చెరువులుగా మార్చేశారు. మరికొన్ని భూములు కబ్జా కోరల్లో ఉన్నాయి. వీటిల్లో చాలా భూములను రెవెన్యూ వర్గాల కనుసన్నల్లోనే వివిధ అవసరాలకు మార్పిడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో  వారి నుంచి భూముల వాస్తవ సమాచారం, భూములు లెక్కలు బహిర్గతం అవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
 ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పరిశీలన
 భూముల రికార్డులను నవీకరించిన అనంతరం ఏప్రిల్ 1నుంచి క్షేత్ర స్థాయిలో భూముల ప్రత్యక్ష పరిశీలన కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే భూమి లెక్కులు ఉన్నాయా లేదా అనే అంశాలపై బృందాల వారీగా ప్రత్యక్ష పరిశీలన జరపాల్సి ఉంటుంది. భూమి రికార్డుల నవీకరణ చేస్తున్న మాట వాస్తమేనని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు తెలిపారు. భూ వివాదాలను పరిష్కరించడానికి ఈ సర్వే ఉపకరిస్తుందన్నారు. అన్ని మండలాల్లోను భూమి రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసి గ్రామాల వారీగా వాటిని నోటీస్ బోర్డుల్లో ఉంచుతామని, వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని ఆయన చెప్పారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement