నేటి నుంచి ఆకేపాటి, కొరముట్ల ఆమరణ దీక్ష | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆకేపాటి, కొరముట్ల ఆమరణ దీక్ష

Published Thu, Aug 15 2013 5:14 AM

All MLA leaders are going to do strike

రాజంపేట/ రైల్వేకోడూరు రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం గురువారం నుంచి ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆకేపాటి రాజంపేటలోఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే సమైక్య రాష్ట్రం కోసం ఆకేపాటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్ర విషయంలో యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలనే సంకల్పంతోనే ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
 గురువారం ఉదయం పది గంటల నుంచి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దీక్ష ప్రారంభం కానుంది. తొలుత రాజంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం వైఎస్సార్ సర్కిల్‌లో ఎమ్మెల్యే ఆమరణ దీక్షకు కూర్చోనున్నారు. అలాగే సమైక్యాంధ్రకోసం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. స్థానిక వైఎస్‌ఆర్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు.
 
 రైల్వేకోడూరులోని వైఎస్‌ఆర్ సర్కిల్ టోల్‌గేట్ వద్ద ఉదయం 10 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభమవుతుందన్నారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధికారపార్టీ ఏకపక్ష నిర్ణయంతో తెలంగాణను ప్రకటించడం వలన రాష్ట్రం రావణకాష్టంలా తయారైందన్నారు. ఈ రావణ కాష్టంలో రాష్ట్ర విభజనకు పాల్పడినవారు కాలిపోక తప్పదన్నారు.  అధికారపార్టీ దిగివచ్చి నిర్ణయం మార్చుకునేంతవరకు ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలన్నారు.
 

Advertisement
Advertisement