అమరావతి: ఎప్పుడూ లేని విధంగా కృష్ణా డెల్టాకు ముందుగా నీళ్లు ఇచ్చాము.. రైతులు పంటలు వేసుకునేందుకు సిద్ధం కావాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన కృష్ణా తూర్పు డెల్టాకు నీరు విడుదల చేశారు. పట్టిసీమ విషయంలో తనపై అనేక ఆరోపణలు చేశారని, వాటికి భయపడి తాను వెనకడుగు వేసి ఉంటే కృష్ణాకు తీవ్ర నష్టం జరిగేదని అన్నారు.
గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు కృష్ణాకు తీసుకొస్తామని, రాష్ట్రంలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. రైతులకు పంటల కంటే ముందే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజీ చుట్టూ విహార ప్రాంతంగా మారుస్తున్నామని చంద్రబాబు చెప్పారు.