విజయవాడలో దారుణహత్య | Sakshi
Sakshi News home page

విజయవాడలో దారుణహత్య

Published Tue, Mar 14 2017 1:45 AM

విజయవాడలో దారుణహత్య

పట్టపగలే యువకుడిపై దాడి
అడ్డుకున్న మృతుడి తల్లికి కత్తిపోట్లు


గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): పట్టపగలు నడిరోడ్డుపై యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన విజయవాడలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌ వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన పోలా పద్మ, ఆమె కుమారుడు నరేంద్ర(21) పండ్ల మార్కెట్‌లో కూలీ పనులు చేస్తుంటారు. పద్మ భర్తను వదిలివేసి ఒంటరిగా ఉంటోంది. మార్కెట్‌లో మేస్త్రీగా పనిచేస్తున్న ఫ్రైజర్‌పేటకు చెందిన గణపా శివతో పద్మకు వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తన ఇంటికి రావద్దంటూ శివకు పద్మ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. తన సొమ్ము కాజేసి చివరికి ఇంటికి రావద్దంటూ గెంటివేశారని కక్ష పెంచుకున్న శివ అదనుకోసం ఎదురు చూశాడు.

సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నరేంద్ర తను పనిచేస్తున్న దుకాణం వద్దకు బైక్‌పై వచ్చాడు. రోడ్డుపక్కన బైక్‌ పార్క్‌ చేయబోతున్న సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న శివ కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ప్రాణభయంతో పరుగెడుతుండగా శివ వెంటాడి నరికాడు. తన కుమారుడిపై దాడి చేస్తున్న విషయం తెలుసుకున్న పద్మ కేకలు వేస్తూ పండ్ల దుకాణం నుంచి బయటకు రాగా ఆమెపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న పద్మ, ఆమె కుమారుడు నరేంద్రను 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన నరేంద్ర మార్గమధ్యంలో చనిపోగా అతని తల్లి చికిత్స పొందుతోంది. దాడికి పాల్పడిన శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
Advertisement