సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో సమైక్యాంధ్య్ర ఉద్యమం హోరెత్తుతున్నా పట్టించుకోని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి వట్టి వసంత్కుమార్ ఉన్నట్టుండి జిల్లాకొచ్చి హడావుడి చేయ డం చర్చనీయాంశమైంది. ఒక్క రోజు లోనే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తిరిగి సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమకారులకు మద్దతు పలికారు. రాష్ట్ర విభజనపై తన అభిప్రాయాన్ని చెప్పడంతోపాటు తాను ఎందుకు రాజీ నామా చేయలేదనే విషయాన్ని కొత్త వాదనతో సమర్థించుకుని జారుకున్నారు. ఇన్నిరోజులూ కనపడని వసంత్కుమార్ ఇప్పుడు హఠాత్తుగా ప్రత్య క్షం కావడంపై ఉంగుటూరు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఆయన సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్న వారికి మద ్దతు పలికేందుకు రాలేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏలూరులో అధికారికంగా నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం జిల్లాకు వచ్చారు. ఈ వేడుకలకు ఎలాగూ రావాలి కాబట్టి ఒకరోజు ముందు వచ్చి సొంత నియోజకవర్గమైన ఉంగుటూరులో హడావుడి చేశారు. భీమడోలు, గణపపరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో సమైక్య రాష్ట్ర కోసం దీక్షలు చేస్తున్న వారిని పరామర్శించి మద్దతు పలి కారు. ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నా ఇన్నిరోజులు ఆయన ఎందుకు రాలేదు, కనీసం ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలకు ఆయన రకరకాల సమాధానాలు చెప్పి ప్రజల నుంచి తప్పించుకున్నారు.
రాజీనామా ఎందుకు చేయలేదంటే!
సమైక్యాంధ్ర కోసం ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో తాను పదవికి ఎందుకు రాజీనామా చేయలేదనే ప్రశ్నలకు మంత్రి కొత్త భాష్యాలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందట. అందుకే రాజీ నామా చేయలేదని, విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసే సమయంలో అసెంబ్లీలో ఉండాలి కాబట్టి ఈ నిర్ణ యం తీసుకున్నానని నమ్మబలికారు. చివరకు తాను పక్కా సమైక్యవాదినని చెప్పుకున్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన తర్వాత దాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోతే కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు.
అప్పటికీ న్యాయం జరక్కపోతే పదవిని తృణప్రాయంగా వదులుకుంటానని సెల విచ్చి వెళ్లారు. నిజానికి వసంత్ మంత్రి పదవికి రాజీనామా చేస్తారని విభజన ప్రకటన వెలువడిన వెంటనే వార్తలు వచ్చాయి. కానీ.. ఎందుకనో మంత్రి ముందడుగు వేయలేదు. జిల్లాలో ఆయనకు పోటీదారుగా ఉన్న మరో మంత్రి పితాని సత్యనారాయణ మాత్రం ఈ మధ్యనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి జనం మధ్యకు వచ్చారు. పితాని రాజీనామా చేసినప్పుడు వట్టి ఎందుకు రాజీనామా చేయలేదనే చర్చ జిల్లాలో కొద్దిరోజులు నడిచింది. అయితే వారి రాజకీయాలను పట్టించుకునే తీరిక జనాలకు లేకపోవడంతో ఆ విషయం మరుగునపడింది. అయితే, వసంత్ రాజీనామా చేయకపోయినా కనీసం సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా ఎందుకు స్పందించలేదని ఆయన అనుయాయులు నిన్నటివరకూ మదనపడ్డారు. జిల్లా అంతటా ఉద్యమ హోరుతో అల్లకల్లోలంగా ఉన్నా పట్టించుకోని మంత్రి చివరకు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి హడావుడి చేయడం విశేషం.