అందరికీ థ్యాంక్స్ | Sakshi
Sakshi News home page

అందరికీ థ్యాంక్స్

Published Sat, Jul 12 2014 2:31 AM

అందరికీ థ్యాంక్స్

కడప కల్చరల్ : జిల్లా ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరిచిపోలేనని బదిలీపై వెళుతున్న కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బంగ్లాలో అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తనను సొంత బిడ్డలా ఆదరించారని, వారిని ఎప్పటికీ గుర్తించుకుంటానని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసుశాఖలు సంయుక్తంగా పనిచేస్తేనే ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రక్షణ లభించగలవన్నారు. జిల్లా  ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ కీలక సమయంలో కీలక పదవికి వెళుతున్న కలెక్టర్‌కు ప్రత్యేక వీడ్కోలు తెలుపుతున్నామన్నారు. విభజన నేపధ్యంలో హైదరాబాదులో ఎక్కువగా పని ఉంటుందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సాధారణ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడం కోన శశిధర్ ప్రతిభకు నిదర్శనమన్నారు. ఏజేసీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల మధ్య సత్సంబంధాలు పెంచుకోవాలని, ఉద్యోగులకు క్రీడలు నిర్వహించి కలెక్టర్ విజయం సాధించారన్నారు. ఒకేసారి నాలుగు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఏకైక కలెక్టర్ కోన శశిధర్ అన్నారు.
 
 కార్యక్రమంలో ఓఎస్‌డీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, డీఆర్వో సులోచన, పరిశ్రమలశాఖ జీఎం గోపాల్, డీఆర్‌డీఏ,డ్వామాు, ఏపీఎంఐపీ పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రతిభా భారతి, స్టెప్ సీఈఓ మమత, నగర పాలక సంస్థ కమిషనర్ ఓబులేశు, ఉద్యాన శాఖ ఏడీ మదుసూదన్‌రెడ్డి, ఇంకా పలువురు జిల్లా అధికారులు కోన శశిధర్ అందించిన సేవలను గురించి వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ, అధికారుల సంఘం ప్రతినిదులు కోన శశిధర్‌ను ఘనంగా సత్కరించారు.
 

Advertisement
Advertisement